ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తెలివిగా వ్యవహరించింది. ఉద్దేశపూర్వకంగానే బిడ్ వేస్తూ ఆటగాళ్ల ధరను అమాంతం పెంచి ప్రత్యర్థికి నష్టం చేసింది. ప్రత్యర్థి జట్టు బడ్జెట్ను ఖాళీ చేసే వ్యూహంలో భాగంగా కావ్య మారన్ ఈ పని చేసింది. కావ్య మారన్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ తమ పర్స్ ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అనామక ఆటగాళ్లు అయిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలు రూ.14.20 కోట్ల రికార్డ్ ధర పలకడం వెనుక కావ్య మారన్ ఉంది.
కనీస ధర రూ.30 లక్షలతో ఈ ఇద్దరూ వేలంలోకి రాగా సన్రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు బిడ్ వేసి రేటును అమాంతం పెంచింది. చివరకు సన్రైజర్స్ హైదరాబాద్ వెనకడుగు వేయడంతో రూ.14.20 కోట్ల భారీ ధర చొప్పున ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను సీఎస్కే కొనుగోలు చేయాల్సి వచ్చింది. కావ్యమారన్ బిడ్ వేయకుండా ఉంటే.. ఈ ఇద్దరూ రూ.10 కోట్ల లోపే సీఎస్కేకు చిక్కేవారు.

జమ్మూకశ్మీర్ పేస్ ఆల్రౌండర్ ఆకీబ్ దార్కు రూ.8.40 కోట్ల రికార్డ్ ధర పలకడం వెనుక కూడా కావ్య మేడమ్ ఉన్నారు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో కావ్య పాప తీవ్రంగా పోటీ పడింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతని ధరను ఆమాంతం పెంచేసి ఢిల్లీకి వదిలేసింది. ఈ బిడ్ ముగిసిన తర్వాత కావ్య పాప ఇచ్చిన రియాక్షనే ఆమె వ్యూహం ఏంటో తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ధరను పెంచాలనే ప్రయత్నంలోనే ఆకీబ్ దార్ కోసం బిడ్ వేసినట్లు కనిపించింది. ఈ రెండు ఫ్రాంచైజీల మధ్య నెలకొన్న పోటీ కారణంగా ఆకీబ్ దార్ పంట పండింది.
వేలం చివర్లో లక్నో సూపర్ జెయింట్స్కు కూడా కావ్య మారన్ ఇదే తరహా షాకిచ్చింది. లియామ్ లివింగ్ స్టోన్ విషయంలో తీవ్రంగా పోటీ పడి అతని ధరను రూ.13 కోట్లకు పెంచేసిన లక్నోపై కావ్య పాప రివేంజ్ తీసుకుంది. జోష్ ఇంగ్లీస్ కోసం తీవ్రంగా పోటీపడి అతని ధరను రూ.8.60 కోట్లకు పెంచేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముందుగా జోష్ ఇంగ్లీస్ను ఎవరూ పట్టించుకోలేదు. రెండోసారి వేలంలో వచ్చిన అతని ధరను కావ్య మారన్ అమాంతం పెంచేసింది. వేలం సందర్భంగా కావ్య మారన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెట్టింట వైరల్గా మారాయి.