ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఓనర్ కావ్య మారన్ ఘోర తప్పిదం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ ఆక్షన్లో రూ.25.5 కోట్ల భారీ పర్స్తో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్క టాప్ ప్లేయర్ కోసం కూడా ప్రయత్నించలేదు. కనీస ధరకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కూడా కోనుగోలు చేయలేదు.
కావ్యమారన్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ టీమ్ సైలెంట్గా ఉండిపోయింది. అయితే టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నించి చివర్లో చేతులెత్తేసింది. రవి బిష్ణోయ్ను వదిలేసి కావ్య మారన్ పెద్ద తప్పిదం చేసిందని క్రికెట్ విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్కు క్వాలిటీ స్పిన్నర్ అవసరం ఉంది.

గతేడాది రాహుల్ చాహర్ తీవ్రంగా నిరాశపర్చడంతో అతన్ని వేలంలోకి వదిలేసిన ఆరెంజ్ ఆర్మీ.. రవి బిష్ణోయ్తో అతని స్థానాన్ని భర్తీ చేయాలని ప్రయత్నించింది. కానీ రూ.7 కోట్ల వరకు బిడ్ వేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ రూ.7.20 కోట్లకు బిడ్ వేయడంతో వెనక్కి తగ్గింది.
దాంతో రవి బిష్ణోయ్ రాజస్థాన్ రాయల్స్ సొంతమయ్యాడు. అనంతరం అకీబ్ దార్ కోసం ప్రయత్నించిన కావ్య మారన్.. అతని రేటు కూడా పెంచి వదిలేసింది. అనామక ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం కూడా సన్రైజర్స్ తీవ్రంగా ప్రయత్నించింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతని ధరను రూ.14.20 కోట్లకు పెంచింది. చివరకు సీఎస్కే ఆ ధరకు అతన్ని కొనుగోలు చేసింది. శివాంగ్ కుమార్ను రూ.30 లక్షలకే సన్రైజర్స్ ఛేజిక్కించుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. 4 టీ20లు ఆడి 4 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ ప్లేయర్ తక్కువ ధరకు దక్కడంపై సన్రైజర్స్ ఆక్షన్ టీమ్ సంబరాలు చేసుకుంది. తద్వారా ఈ ప్లేయర్ సన్రైజర్స్ ఆక్షన్ ప్రణాళికలో ఉన్నట్లు అర్థమైంది.
పూర్తిగా దేశవాళీ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ సలీల్ అరోరాకు మాత్రమే రూ.1.50కోట్లు ఖర్చు చేసింది. మిగతా ఆటగాళ్లందర్నీ రూ.30 లక్షల కనీస ధరకు చేజిక్కించుకుంది. పూర్తిగా అనామక ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్స్లో డబ్బులు మిగిలించుకొని ఏం చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.