ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది. మార్క్యూ ప్లేయర్స్ లిస్ట్-2లో రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మహమ్మద్ షమీ కోసం కోల్కతా నైట్రైడర్స్ తీవ్రంగా పోటీపడింది.
దాంతో అతని ధర రూ. 9.75 కోట్లకు చేరింది. కేకేఆర్కు దాదాపు ఖాయమవుతుండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ దూకుడుగా వ్యవహరించి రూ. 10 కోట్లకు బిడ్ వేసింది. షమీ పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ఆర్టీఎమ్ కార్డ్ కింద తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో షమీ సన్రైజర్స్ సొంతమయ్యాడు.

గాయాల నేపథ్యంలోనే ఆ జట్టు మహమ్మద్ షమీని వదిలేసినట్లు తెలుస్తోంది. చీలమండ గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత షమీ.. ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆడలేదు. ఇటీవలే రంజీ ట్రోఫీలోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు సిద్దమవుతున్నాడు.
కావ్య మారన్ తన మార్క్ సెలెక్షన్తో షమీని కొనుగోలు చేసింది. ప్యాట్ కమిన్స్కు తోడుగా సీనియర్ ఇండియన్ పేసర్ను కొనుగోలు చేయడం మంచి ఆప్షన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిట్నెస్ సమస్యలు లేకుండా షమీ అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటే.. జట్టుకు మేలు జరగనుంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు అతను మంచి రిప్లేస్మెంట్ కానున్నాడు.
అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్.. అర్ష్దీప్ సింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. రూ. 18 కోట్ల వరకు బిడ్ వేసింది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా అతన్ని ఆరెంజ్ ఆర్మీ నుంచి లాక్కుంది.
IPL 2025 మెగా వేలం హైలైట్స్
అర్ష్దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్టీఎమ్)
కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)
జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)
రిషభ్ పంత్-రూ. 27 కోట్లు(లక్నో సూపర్ జెయింట్స్)
మహమ్మద్ షమీ-రూ. 10 కోట్లు(SRH)
డేవిడ్ మిల్లర్-రూ. 7.5 కోట్లు(లక్నో సూపర్ జెయంట్స్)