రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ అనుసరిస్తున్న వ్యూహాలు ఏ మాత్రం అంతుపట్టడం లేదని మండిపడుతున్నారు. తొలి రోజు మెగా వేలంలో కీలకమైన ఆటగాళ్లను వదిలేసారని, రెండో రోజు కూడా అదే తరహా ప్రవర్తనను కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు ఆర్సీబీ కనీసం బిడ్ వేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి అందుబాటులోకి వచ్చిన ఈ సౌతాఫ్రికా దిగ్గజాన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ప్రైజ్కే అతన్ని దక్కించుకుంది. ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా ఫాఫ్ డుప్లెసిస్ను తీసుకుంటారా? అని ఆర్సీబీని ప్రశ్నించగా.. ఆ జట్టు ఆసక్తి చూపించలేదు.

రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న అతని కొనుగోలు చేయకపోవడం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు వేలంలో ఎవరిని కొందామని వచ్చారని ప్రశ్నిస్తున్నారు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లకు బిడ్ వేయలేదని, సీనియర్ స్పిన్నర్లు అయిన అశ్విన్, యుజ్వేంద్ర చాహల్లను కూడా కొనేందుకు ప్రయత్నించలేదని మండిపడుతున్నారు.
'ఎవర్రా మీరంతా.. అందర్నీ వదిలేస్తున్నారు?'అని ఆర్సీబీని ఉద్దేశించి పోస్ట్లు పెడుతున్నారు. కేన్ విలియమ్సన్, గ్లేన్ ఫిలిప్స్, అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్లు కనీస ధరలకే అందుబాటులో ఉన్నా ఆర్సీబీ వారివైపు కనీసం కన్నెత్తి చూడలేదు. వాషింగ్టన్ సుందర్, పృథ్వీ షాలను తీసుకోవాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తొలి రోజు వేలంలో మొత్తం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసిన ఆర్సీబీ.. నలుగురి కోసమే 43.75 కోట్లు ఖర్చు చేసింది. జోష్ హేజిల్వుడ్ (రూ. 12.50 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు), జితేశ్ శర్మ (రూ. 11 కోట్లు), లివింగ్స్టన్ (రూ. 8.75 కోట్లు), రసిక్ సలాం (రూ. 6 కోట్లు), సుయాష్ శర్మ (రూ. 2.60 కోట్లు) మాత్రమే కొనుగోలు చేసింది.
ఈ ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ. 89.53 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో రూ. 30.65 కోట్లు ఉన్నాయి. మరో మూడు ఆర్టీఎమ్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా 16 మంది విదేశీ ఆటగాళ్లు అవసరం ఉండగా.. ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది.