ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ ఆక్షన్లో పంజాబ్ కింగ్స్ కో ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా ఘోర తప్పిదం చేసింది. అత్యుత్సాహంతో ఒకరికి బదులు మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. వెంటనే తప్పును గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా.. ఐపీఎల్ నిర్వాహకులు ఒప్పుకోకపోవడం సదరు ఆటగాడినే జట్టులోకి తీసుకుంది.
సొట్ట బుగ్గల సుందరి చేసిన ఈ తప్పిదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ తప్పిదంపై పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. క్రికెట్ ఓనమాలు కూడా తెలియని హీరోయిన్లు టీమ్ ఓనర్స్గా ఉంటే ఇలానే అవుతుందని కామెంట్ చేస్తున్నారు. గత 16 ఏళ్లుగా క్రికెట్ ఎక్స్పర్ట్స్ను పట్టించుకోకుండా వేలంలో ఇలానే అనవసరమైన ఆటగాళ్లును తీసుకున్నారని, దాంతోనే పంజాబ్ కింగ్స్ టైటిల్ గెలవలేదని మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా ఆక్షనీర్ మల్లికా సాగర్.. ఛత్తీస్ ఘడ్కు చెందిన ఆల్రౌండర్ శశాంక్ సింగ్ పేరు ప్రస్తావించగా.. ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ ఆక్షన్ టీమ్.. మరో శశాంక్ సింగ్ అనుకొని బిడ్ వేసింది. అతని కోసం మరే ప్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో మల్లికా సాగర్.. పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షలకు దక్కించుకున్నట్లు ప్రకటించింది.
వెంటనే పంజాబ్ కింగ్స్ ఈ ఆటగాడు తమకు వద్దంటూ ఆక్షనీర్ దృష్టికి తీసుకొచ్చింది. ప్లేయర్ విషయంలో తమ పొరబడ్డామని తెలిపింది. అయితే ఆటగాడిని లాక్ చేసిన తర్వాత మళ్లీ వేలంలోకి తీసుకురావడం నిబంధనలకు విరద్దమని చెప్పడంతో పంజాబ్ మౌనంగా ఉండిపోయింది.
పంజాబ్ పొరపాటున కొనుగోలు చేసిన శశాంక్ సింగ్కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డే ఉంది. 55 టీ20ల్లో అతను 724 పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు. గతంలో శశాంక్ సింగ్ సన్రైజర్స్ హైదరాబాద్కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్లో అతన్ని ఆరెంజ్ ఆర్మీ వదిలేసింది. ఐపీఎల్ 2023 సీజన్లో అతను అన్సోల్డ్గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇలాంటి తప్పిదం చేయబోయింది. కానీ వెంటనే అప్రమత్తమై సరిదిద్దుకుంది.