ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబర్చింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. ఈ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోసారి ఆమెనే వేలం టీమ్ను లీడ్ చేసింది. జట్టుకు లోటుగా ఉన్న టాపార్డర్ లెఫ్టార్మ్ బ్యాటర్, స్పెషలిస్ట్ స్పిన్నర్, పేస్ ఆల్రౌండర్ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది.
ట్రావిస్ హెడ్ను రూ. 6.80 కోట్లకు కొనుగోలు చేసి వేలాన్ని మొదలుపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. వానిందు హసరంగాను రూ. కోటి 50 లక్షలకే దక్కించుకుంది. ఇక ప్యాట్ కమిన్స్ కోసం రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఆర్సీబీతో తీవ్రంగా పోటీ పడి మరి తీసుకుంది. అయితే టీమ్ బలహీనతలను అధిగమించినా.. పూర్తిగా ఓవర్సీస్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మన కర్మరా అయ్యా.. అంటూ సన్రైజర్స్ను ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే 'కావ్య పాపకు ఎవరైనా చెప్పండ్రా.. తుది జట్టు ఆడేది నలుగురు ఓవర్సీస్ ఆటగాళ్లేనని'అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇప్పటికే ఎయిడెన్ మార్క్రమ్, హెన్రీచ్ క్లాసెన్, గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్లతో ఓవర్సీస్ ఆటగాళ్లున్నారు. అయినా సన్రైజర్స్ తమ బలహీనతలను ఓవర్సీస్ ఆటగాళ్లతో భర్తీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్ ప్రసాద్ సైతం సన్రైజర్స్ హైదరాబాద్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దేశీయ ఆటగాళ్లపై సన్రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ దగ్గర రూ. 5.2 కోట్ల పర్స్ మనీ ఉండగా.. మరో ముగ్గురు ప్లేయర్లను తీసుకోవాల్సింది.
