ఐపీఎల్ 2024 వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం దుబాయ్లోకి కోక కోలా అరెనా వేదికగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఆటగాళ్ల వేలం ప్రారంభం కానుంది. ఇప్పటికే వేలం బరిలో నిలిచే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 333 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి.
ఐపీఎల్ 2024 వేలంలో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు. టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారితో పాటు వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా ఉన్నారు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించిన కేఎస్ భరత్ను ఆ జట్టు వదులుకోవడంతో వేలంలోకి వచ్చాడు.

ఈ ఇద్దరతో పాటు పృథ్వీ రాజ్ యర్రా, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవి తేజ, మనీశ్ రెడ్డి, మురుగన్ అభిషేక్, ఎర్రవల్లి అవనీశ్ రావ్, రక్షణ్ రెడ్డి, రాహుల్ బుద్దిలు ఉన్నారు. ఈ జాబితాలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీ రాజ్ యర్రాలకు మాత్రమే ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది.
హనుమ విహారి 24 ఐపీఎల్ మ్యాచ్ల్లో 284 రన్స్ చేశాడు. హనుమ విహారి 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ప్రతీ సీజన్లో అతను అన్సోల్డ్ ప్లేయర్గానే మిగిలిపోతున్నాడు. తాజా వేలానికి విహారి రూ. 50 లక్షల కనీస ధరతో రిజిస్టర్ చేసుకున్నాడు.
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కేఎస్ భరత్.. 10 ఐపీఎల్ మ్యాచ్ల్లో 199 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ తరఫున మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన అతను ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు. అతనికి ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు మారినా.. తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ సారి కేఎస్ భరత్ రూ. 50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్నాడు.
గుంటూరుకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యర్ర పృథ్వీ రాజ్ కేకేఆర్ తరఫున 2 ఐపీఎల్ మ్యాచ్లే ఆడాడు. ఈ సారి అతను రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.
గుంటూరుకే చెందిన లెఫ్టార్మ్ బ్యాటర్ రోహిత్ రాయుడు.. నిజామాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనికేత్ రెడ్డి, హైదరాబాద్ ఆల్రౌండర్ రవి తేజ, మనీశ్ రెడ్డి, స్పిన్ బౌలర్ అభిషేక్, బ్యాటర్ అవనీశ్ రావ్, పేసర్ రక్షణ్ రెడ్డి ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరితో పాటు గతంలో ముంబై ఇండియన్స్కు ఎంపికైన రాహుల్ బుద్ది కూడా రూ. 20 లక్షల కనీస ధరతో వేలం బరిలో నిలిచారు.