ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి రంగం సిద్దమైంది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దుబాయ్ వేదికగా ఆటగాళ్ల వేలం మొదలవ్వనుంది. పది ఫ్రాంచైజీల్లో గరిష్టంగా 77 స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో 30 ఓవర్సీస్ స్థానాలు ఉన్నాయి. ఈ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి.
టీమ్ బలహీనతలను అధిగమించే ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాయి. మాక్ ఆక్షన్లతో ప్రాక్టీస్ కూడా చేశాయి. అయితే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బ్రాడ్ హగ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఓ ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే ఆ జట్టు టాప్-3లో నిలుస్తుందని తెలిపాడు. మనీశ్ పాండే, హర్షల్ పటేల్తో పాటు డారిల్ మిచెల్ లేదా రచిన్ రవీంద్రల్లో ఒకరిని తీసుకోవాలని సూచించాడు.

'హర్షల్ పటేల్ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. చెన్నై పిచ్పై హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఒకవేళ వాళ్లు మనీష్ పాండే.. డారిల్ మిచెల్ లేదంటే రచిన్ రవీంద్రల్లో ఒకరు.. కొనుక్కుంటే పాయింట్ల పట్టికలో టాప్-3లో నిలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్కు మిడిలార్డర్లో రాణించగల భారత బ్యాటర్ అవసరం ఉంది. అంబటి రాయుడి రిటైర్మెంట్తో ఈ ఖాళీ ఏర్పడింది. మనీశ్ పాండే ఆ లోటు భర్తీ చేయగలడు. అతను కేవలం బ్యాటర్ మాత్రమే కాదు. మంచి ఫీల్డర్ కూడా. కాకపోతే ఇప్పటి వరకు అతను అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీయలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ గనుక అతనికి అవకాశం ఇస్తే.. ధోనీ సారథ్యంలో అతను తన సత్తా ఏంటో చూపిస్తాడు. మనీష్ పాండే కాదనుకుంటే డారిల్ మిచెల్ను తీసుకోవాలి. లేదంటే రచిన్ రవీంద్రనైనా తీసుకోవాలి.'అని బ్రాడ్ హగ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయపడ్డాడు.
చెన్నై సూపర్ కింగ్స్లో 6 స్లాట్స్ ఖాళీగా ఉండగా.. ఇందులో మూడు ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఆ జట్టు వద్ద ప్రస్తుతం రూ.31.4 కోట్ల పర్స్ మనీ ఉంది. చెన్నై ఓ విదేశీ పేసర్తో పాటు మిడిలార్డర్పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.