
ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో..
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఓ జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆడే అవకాశం లేదు. అయితే ఒకసారి ముంబై ఇండియన్స్ ఐదుగురు ఓవర్సీస్ ఆటగాళ్లతో బరిలోకి దిగింది. కాకపోతే అది చాంపియన్స్ లీగ్ టీ20. ఈ టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఓ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు చెందిన భారత ఆటగాళ్లంతా గాయపడటంతో తప్పని పరిస్థితుల్లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ప్రత్యేక పరిస్థితిగా పరిగణించిన లీగ్ నిర్వాహకులు ముంబైకి ప్రత్యేక అనుమతిచ్చారు.
దాంతో కీరన్ పొలార్డ్, లసిత్ మలింగా, ఆండ్రూ సైమండ్స్, డేవీ జకోబ్స్, ఎయిడెన్ బ్లిజ్జార్డ్ బరిలోకి దిగారు. మలింగా ఆల్రౌండ్షోతో దుమ్మురేపడంతో ముంబై అద్భుత విజయాన్నందుకుంది. కీరన్ పోలార్డ్ కూడా సూపర్బ్గా ఆడాడు. కానీ ఇతర ఓవర్సీస్ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

సచిన్ వల్లే ముంబై ఇండియన్స్..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వల్లే ముంబై ఇండియన్స్ పేరు పెట్టారు. లేకుంటే ఈ ఫ్రాంచైజీకి ముంబై రేజర్స్ అని పెట్టేవారు. ముంబై ఇండియన్స్ టీమ్ లోగోలో సుదర్శన చక్రం ఉంటుంది. దాన్ని అర్థం ప్రతిబంబించేలా రేజర్స్ అనేపదం చేర్చాలనుకున్నారు. కానీ సచిన్ టెండూల్కర్ విభిన్నంగా ఉండాలని ముంబై ఇండియన్స్ పేరు సూచించాడు.
ముంబైతో పాటు జాతీయవాదం ఉట్టిపడేలా ఈ పేరు ఉండటంతో ఫ్రాంచైజీ ఓకే చెప్పింది. దాంతో ముంబై రేజర్స్గా ఉండాల్సిన పేరు ముంబై ఇండియన్స్ అయింది. ఈ పేరును ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్లు నిలబెట్టారు. ఐదు టైటిళ్లు నెగ్గేలా ఆధిపత్యం చెలాయించి.. అభిమానుల ఆదరణ పొందిన బ్రాండ్గా మార్చగలిగారు.

ధనిక ఫ్రాంచైజీ..
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అత్యంత ధనవంతమైన ఫ్రాంచైజీ. భారత్లోనే అత్యంత సంపన్నులైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఫ్రాంచైజీ యజమాని. క్రికెట్ అంటే పడిచచ్చే ముంబై, మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించే ఈ జట్టు కోసం రిలయన్స్ సంస్థ ఏకంగా 112 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. భారీ ఖర్చు చేయడమే కాకుండా సక్సెస్ఫుల్ టీమ్గా తీర్చిదిద్దేందకు ప్రత్యేక డెడికేషన్ చూపించింది. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్దపెట్టింది. ఆసియాలోనే ధనవంతుడైన అంబానీ అండతో ముంబై సక్సెస్ఫుల్ టీమ్గా నిలిచింది.

బ్రావో సాయంతో జట్టులోకి పొలార్డ్..
ముంబై ఇండియన్స్ విజయాల్లో వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ కీలరన్ పొలార్డ్ది కీలక పాత్ర. అసలు అతను లేని ముంబై జట్టును ఊహించడమే కష్టం. ఈ విండీస్ వీరుడు తనదైన విధ్వంసకర బ్యాటింగ్తో ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే ఎవరికీ పెద్దగా తెలియని విషయం ఏంటంటే పొలార్డ్ను ముంబైకి పరిచయం చేసింది డ్వేన్ బ్రావోనే.
ఆరంభంలో ముంబై ఇండియన్స్కు ఆడిన డ్వేన్ బ్రావో.. 2010 సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్కు మారాడు. అప్పుడు తనకు రిప్లేస్మెంట్గా ఓ ఆటగాడిని చూపించాలని ముంబై ఇండియన్స్ కోరగా.. బ్రావో.. పోలార్డ్ పేరు సూచించాడు. కానీ అప్పటికే పొలార్డ్ వేరే క్లబ్కు ఆడుతుండటంతో డ్వేన్ స్మిత్ పేరు చెప్పాడు. ఇక 2011 సీజన్కు పొలార్డ్ ఖాళీగా ఉన్నాడని చెప్పడంతో.. ముంబై ఇండియన్స్ అతనికి కోటిన్నర రూపాయలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్కే ఆడుతున్నాడు.


Click it and Unblock the Notifications
