ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కేకేఆర్ విజయం సాధించి గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో సన్రైజర్స్ ఉంది. ఈ విజయంతో గత సీజన్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.
మరోవైపు కేకేఆర్ పరిస్థితి కూడా సన్రైజర్స్లానే ఉంది. ఓటమితో ఈ సీజన్ను ప్రారంభించిన ఆ జట్టు.. రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయాన్నందుకుంది. కానీ ముంబై ఇండియన్స్తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే సొంతగడ్డపై సన్రైజర్స్ను ఓడించాలని కేకేఆర్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక సలహా ఇచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్లో విజయం సాధించాలంటే.. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్లో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. నేటి మ్యాచ్కు స్లో వికెట్ తయారు చేసే అవకాశం ఉందని చెప్పాడు.
'ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లోని పిచ్ సన్రైజర్స్ హైదరాబాద్ గేమ్ ప్లాన్కు సరిగ్గా సూట్ అయ్యింది. హైదరాబాద్లోనే జరిగిన రెండో మ్యాచ్కు పిచ్ మార్చారు. రెడ్ సాయిల్తో పిచ్ను తయారు చేశారు. దాంతో బంతి కాస్త గ్రిప్ అయ్యింది. ఆ మ్యాచ్ను సన్రైజర్స్ ఓడిపోయింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లోని వికెట్ కూడా సన్రైజర్స్ బ్యాటింగ్కు విరుద్దగా ఉంది. సన్రైజర్స్ బ్యాటర్లకు బంతి చక్కగా బ్యాట్పైకి రావాలి. అప్పుడే వాళ్లు చెలరేగుతారు.
కోల్కతా వేదికగా జరిగే మ్యాచ్లో పిచ్.. హైదరాబాద్ తరహాలోనే ఉంటుంది. కానీ కోల్కతా క్యూరేటర్ విభిన్నంగా ఆలోచించి స్లో వికెట్ తయారు చేస్తే తప్పా.. సాధారణంగా ఈడెన్ గార్డెన్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. సన్రైజర్స్ బ్యాటర్లు స్లో వికెట్పై ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ తరహా పిచ్నే తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి సన్రైజర్స్ హైదరాబాద్ భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి. పిచ్ కండిషన్స్ గౌరవిస్తూ బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.