RCB vs LSG: ఆర్సీబీ జట్టులో కీలక మార్పు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి?
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కీలక మార్పు చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తుండగా.. గత మ్యాచ్ ఆడిన జాకోబ్ డఫీ స్థానంలో జోష్ హజెల్ వుడ్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ ఇద్దర్నీ రొటేషన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.
గత మ్యాచ్లో మోకాలి నొప్పితో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. తుది జట్టులో అతని పేరు లేకపోగా.. ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాలో కనిపించింది. దాంతో ఈ మ్యాచ్లో అతను బ్యాటింగ్ మాత్రమే చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2023 సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ప్రవేశపెట్టగా.. గత మూడు సీజన్లలో కోహ్లీ ఎప్పుడూ ఇంపాక్ట్ సబ్గా బరిలోకి దిగలేదు.
చాలా తక్కువగా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొనే కోహ్లీ.. ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దాంతో అతను ఫీల్డింగ్ చేయకుండా బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. తాజా మ్యాచ్కు అతను దూరమవుతాడని ప్రచారం జరిగినా.. ఫిట్నెస్ సాధించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తోంది.

డఫీ ఔట్..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. 'పిచ్ చూడటానికి బాగుంది. అందుకే ముందుగా బౌలింగ్ చేసి ఆ ప్రయోజనాన్ని అందుకొని ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనుకుంటున్నాం.
గత మ్యాచ్లో పిచ్పై గడ్డి ఉండగా.. ఈ మ్యాచ్పై లేదు. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ట్రాక్. జట్టులో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తున్నారు. కొత్త వేదికలపై రాణించడమే మా జట్టు లక్ష్యం. జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. జాకోబ్ డఫీ స్థానంలో జోష్ హేజిల్వుడ్ జట్టులోకి వచ్చాడు.'అని రజత్ పటీదార్ తెలిపాడు.
సేమ్ టీమ్తో లక్నో..
టాస్ ఓడినా నష్టం ఏం లేదని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ' చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే మంచి వికెట్. ఇలాంటి పిచ్లపై ముందుగా బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా పెద్ద తేడా ఉండదు. ప్రత్యర్థి కంటే మెరుగైన క్రికెట్ ఆడాలి. జట్టులో ఎవరికి కేటాయించిన బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహించాలని భావిస్తున్నాం.
ప్రతి మ్యాచ్ తర్వాత మేం ఎలా ఆడుతున్నామో విశ్లేషించుకుంటూ కూర్చోవడం కంటే.. జట్టుపై నమ్మకం ఉంచడం ముఖ్యం. ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకుని, 'ఈ రోజు నేను జట్టును గెలిపిస్తాను' అని ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మా జట్టులో నాయకత్వ లక్షణాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. చివరికి మైదానంలోకి వెళ్లి రాణించడం, ఒత్తిడిని తట్టుకుని జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయడం ముఖ్యం. మేం అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ : ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిక్ సలామ్ దార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications