ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తమ జోరును కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో మంగళవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో మ్యాచ్ను ఏకపక్షం చేయగా.. రవి బిష్ణోయ్, బర్గర్, ఆర్చర్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ను అంపైర్లకు 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో ఫోర్, 5 సిక్స్లతో 39) సిక్సర్ల మోత మోగించాడు. ధ్రువ్ జురెల్(2) విఫలమైనా.. కెప్టెన్ రియాన్ పరాగ్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20) దూకుడుగా ఆడాడు.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా మొహమ్మద్ గజన్ఫర్(2/21) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ ధాటికి జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ మ్యాచ్లో తేలిపోయాడు. 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ తీయలేకపోయాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 6 వికెట్లకు 123 పరుగులే చేసి ఓటమిపాలైంది. షెర్ఫన్ రూథర్ఫోర్డ్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25), నమన్ ధీర్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 25) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(8), రోహిత్ శర్మ(5), సూర్యకుమార్ యాదవ్(6), తిలక్ వర్మ(14), హార్దిక్ పాండ్యా(9), శార్దూల్ ఠాకూర్(8) తీవ్రంగా నిరాశపర్చారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే ఒక వికెట్ తీసాడు.
వర్షం కారణంగా పిచ్పై కవర్లు కప్పి ఉంచడంతో వికెట్ బౌలింగ్కు అనుకూలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాజస్థాన్ ఓపెనర్లు తొలి బంతి నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లోనే ఓ సిక్సర్తో పాటు నాలుగు బౌండరీలు బాదిన యశస్వి జైస్వాల్ 22 పరుగులు పిండుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్లో ఎదుర్కొన్న మూడు బంతుల్లో 2 సిక్స్లు బాదాడు.
ఈ ఇద్దరూ తొలి వికెట్కు 30 బంతుల్లో 80 పరుగులు జోడించి మ్యాచ్ను ముంబై నుంచి లాగేసుకున్నారు. వైభవ్ ఔటైనా.. యశస్వి జైస్వాల్ ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. యశస్వి-వైభవ్ దూకుడైన ఓపెనింగ్ భాగస్వామ్యం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.