టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. 7 మ్యాచ్ల్లో 188 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు పృథ్వీ షా మెరుగైన ప్రదర్శనతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో పృథ్వీ షాకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. దాంతో అతను అన్సోల్డ్గా నిలిచాడు.ఆ తర్వాత ఫిట్నెస్పై ఫోకస్ పెట్టడంతో పాటు దేశవాళీ క్రికెట్లో జట్టు మారిన పృథ్వీ షా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కూడా ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన పృథ్వీ షా.. తనలో ఇంకా సత్తా ఉందని చాటి చెప్పాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో పృథ్వీ షాను మూడు జట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పృథ్వీ షాను మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ దగ్గర రూ.2.75 కోట్ల పర్స్ మనీ మాత్రమే ఉంది. ఆ జట్టుకు ఇంకా ఐదుగురు ఆటగాళ్లు కావాలి. బ్యాకప్ ప్లేయర్ కోసం పృథ్వీ తక్కువ ధరకు లభిస్తే తీసుకోవాలనే యోచనలో ముంబై ఉంది. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్కు అతను మంచి బ్యాకప్ ఓపెనర్ కానున్నాడు.
మినీ వేలంలో భారీ పర్స్ మనీతో బరిలోకి దిగుతున్న కోల్కతా నైట్రైడర్స్ కూడా పృథ్వీ షాను తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతం ఆ జట్టుకు అజింక్యా రహానే ఓపెనర్గా ఉన్నాడు. అయితే దూకుడుగా ఆడే ఓపెనర్ కోసం కేకేఆర్ పృథ్వీ షాను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మహరాష్ట్ర సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లను కోల్కతా వేదికగా ఆడుతుంది. పృథ్వీ షా ప్రదర్శనను కేకేఆర్ స్కౌట్స్ దగ్గరగా చూస్తున్నారు.
పృథ్వీ షా కోసం లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. లక్నోకు ఇద్దరు విదేశీ ఓపెనర్లే ఉండటంతో బ్యాకప్ ఓపెనర్గా పృథ్వీ షాను తీసుకోవచ్చు. దూకుడుగా ఆడే పృథ్వీ షా తమ జట్టుకు సరిగ్గా సరిపోతాడని ఆ జట్టు భావిస్తోంది.