IPL 2026: నేడు కీలక పోరు.. ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. మరో వారంలో లీగ్ దశ ముగియనుంది. అయినా ఇంతవరకు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకోలేదు. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఈసారి నాలుగు కంటే ఎక్కువ జట్లు 16 పాయింట్స్ సాధించే అవకాశం ఉండటంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం కీలక డబుల్ హెడర్ జరగనుంది.
పంజాబ్కు అగ్ని పరీక్ష..
ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో గత సీజన్ ఫైనలిస్ట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ సీజన్ ఫస్టాఫ్లో డబుల్ హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన పంజాబ్ అనూహ్యంగా చతికలపడింది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆర్సీబీతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే తమ చివరి మ్యాచ్లో పంజాబ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే ఆ జట్టు 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఈ రెండు మ్యాచ్ల్లో ఒక్కటి ఓడినా ఇంటిబాట పడుతుంది. దాంతో ఆర్సీబీతో పోరు పంజాబ్కు డూఆర్డైగా మారింది.
ఓడితే ఇంటికే..
మరోవైపు ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీని ఓడించాలంటే పంజాబ్ కింగ్స్ చెమటోడ్చాల్సిందే. బ్యాటింగ్ పరంగా పంజాబ్కు సమస్య లేనప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్ పెద్ద తలనొప్పిగా మారింది.
ముఖ్యంగా చెత్త ఫీల్డింగ్తో గత ఐదు మ్యాచ్ల్లో పంజాబ్ మూల్యం చెల్లించుకుంది. ఆర్సీబీతో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో పంజాబ్ ఉండగా.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని రజత్ పాటిదార్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఓడితే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంటుంది.
ఢిల్లీనా.. రాజస్థాన్ రాయల్స్..?
ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. పంజాబ్ తరహాలోనే రాజస్థాన్ రాయల్స్ కూడా టోర్నీలో ఆరంభంలో సత్తా చాటింది. కానీ గత ఏడు మ్యాచ్ల్లో ఐదు ఓటములతో గతి తప్పింది. రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ల్లో 12 పాయింట్స్తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై ఓటమి రాజస్థాన్ రాయల్స్కు కలిసొచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ఎక్కువగా వైభవ్ సూర్యవంశీపైనే ఆధారపడుతోంది.
అతను ఔటైతే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతోంది. బౌలింగ్లోనూ సమష్టిగా రాణించలేకపోతుంది. అయితే ఆ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి. ఈ మూడింటిలో రెండింటిని మెరుగైన రన్ రేట్తో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. మరోవైపు 12 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ చివరి రెండు మ్యాచ్లు గెలిచి టోర్నీలో ముందడుగు వేసే పరిస్థితి లేదు. కానీ రాజస్థాన్ చేతిలో ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications