ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో టైటిల్పై గురిపెట్టింది. చివరగా ఆరెంజ్ ఆర్మీ డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో టైటిల్ అందుకుంది. ఆ తర్వాత 2018, 2024 సీజన్లలో ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయింది. గతేడాది పేలవ ప్రదర్శనతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ సారైనా మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ అందుకోవాలనే కసితో ఉంది. అయితే ఫిట్నెస్ సమస్యలతో ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్లకు దూరం కావడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. విధ్వంసకర బ్యాటర్లతో బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. ప్యాట్ కమిన్స్ లేని లోటును తీర్చే బౌలర్ ఎవరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంతేకాకుండా వేలంలోకి వదిలేసిన మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ ఎవరూ జట్టులో కనిపించడం లేదు.
దాంతోనే సన్రైజర్స్ హైదరాబాద్ 250+ పరుగులు చేసినా మ్యాచ్ గెలవలేదని ఆకాశ్ చోప్రా వంటి విశ్లేషకులు బల్ల గుద్ది చెబుతున్నారు. విధ్వంసకర బ్యాటర్లు జట్టులో ఉన్నా.. దూకుడుగా ఆడి ఆల్టైమ్ రికార్డు స్కోర్లు నమోదు చేసినా.. జట్టు గెలుస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత సీజన్లోనూ పేలవ బౌలింగ్ సన్రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

ప్రాక్టీస్లో ఆరెంజ్ ఆర్మీ విధ్వంసకర బ్యాటర్లే దూకుడుగా ఆడి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే దూకుడే జట్టుకు బలం, బలహీనతగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్లాట్ పిచ్లపై ఆడిన మ్యాచ్ల్లో గెలవగా.. స్లో వికెట్స్పై ఓటమిపాలైంది. కాస్త నెమ్మదిగా ఉన్న పిచ్పై సన్రైజర్స్ బ్యాటర్లు తేలిపోతుండగా.. బౌలర్లు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు.
ఈ సమస్యను అధిగమించేందుకే సన్రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్లను కొనుగోలు చేసింది. స్మరణ్ రవిచంద్రన్, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగె, శివమ్ మావి, సకిబ్ హుస్సేన్, క్రైనిస్ ఫులెట్రా అనే బౌలర్లను కొనుగోలు చేసింది. అయితే ఇందులో మెజార్టీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం లేదు. వీళ్లలో ఏ ఇద్దరు అసాధారణ ప్రదర్శన కనబర్చినా సన్రైజర్స్ బౌలింగ్ కష్టాలు తీరుతాయి. లేదంటే జట్టు మరోసారి ప్లే ఆఫ్స్ చేరకుండా అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే.