సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సమస్య కాదని, బౌలింగ్ అటాకే అసలు సమస్య అని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బలహీనమైన బౌలింగ్ అటాక్.. బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.
రాజస్థాన్ రాయల్స్తో తొలి మ్యాచ్లో తేలిపోయిన సీఎస్కే.. శుక్రవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో చిత్తయ్యింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆయుష్ మాత్రే(73) విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాటు సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే దూకుడైన బ్యాటింగ్ వృథా అయ్యింది. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మ్యాచ్ను విశ్లేషించిన సునీల్ గవాస్కర్.. సీఎస్కే బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని చెప్పాడు. దాంతో బ్యాటర్లపై 225-230 పరుగుల భారీ స్కోర్ చేయాలనే ఒత్తిడి నెలకొంటుందన్నాడు.

'ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను బట్టి ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య వారి బౌలింగే. అంటే.. తమ బౌలర్లకు గెలిచే అవకాశం ఇవ్వాలంటే వారు ప్రతి మ్యాచ్లోనూ స్థిరంగా 225-230 పరుగులు చేయాల్సి రావచ్చు.
ప్రస్తుతం చాలా జట్లకు బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. పంజాబ్ కింగ్స్ మ్యాచ్లోనే మనం అది చూశాం. అక్కడ మార్కస్ స్టోయినిస్ 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి కూడా సరైన క్రికెటింగ్ షాట్లతో బంతిని క్లీన్గా హిట్ చేశాడు. చాలా జట్లు చివరి వరకు బ్యాటింగ్ చేయగలవు కాబట్టి, చెన్నై తన బౌలింగ్ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.'అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
గతేడాది పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన సీఎస్కే.. ఈ సారి కూడా శుభారంభం అందుకోలేకపోయింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడింది. రాజస్థాన్ రాయల్స్తో 8 వికెట్ల తేడాతో ఓడింది. 128 పరుగుల లక్ష్యాన్ని 47 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ ఛేదించింది. దాంతో ఆ జట్టు రన్ రేన్ దారుణంగా పడిపోయింది. పంజాబ్ కింగ్స్ చేతిలో కూడా ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.