ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో అంపైర్లు ఘోర తప్పిదం చేశారు. ఆర్సీబీ టీమ్ అడగకముందే స్ట్రాటజిక్ టైమ్ ఔట్ ప్రకటించారు. దాంతో మైదానంలో గందరగోళం నెలకొంది. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ ఎవరు అడిగారని ఒకరినొకరు ప్రశ్నించుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు, కోచ్లు ఆ తర్వాత అంపైర్లను నిలదీశారు.
ఫోర్త్ అంపైర్ సూచనతోనే స్ట్రాటజిక్ టైమ్ ఔట్ ప్రకటించామని ఫీల్డ్ అంపైర్లు చెప్పారు. దాంతో ఎవరు అడిగారని ఫోర్త్ అంపైర్ను ఆర్సీబీ మెంటార్ దినేశ్ కార్తీక్, ఆండీ ఫ్లవర్ నిలదీశారు. టైమ్ ఔట్ కోసం ఆర్సీబీ టీమ్ నుంచి సైగలు చేశారని ఫోర్త్ అంపైర్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కార్తీక్, ఫ్లవర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అనవసర బ్రేక్ కారణంగా ఆర్సీబీకి తీవ్ర నష్టం జరిగింది.
హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన దేవదత్ పడిక్కల్ ఈ అనవసర బ్రేక్ అనంతరం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జెమీ ఓవర్టన్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఐపీఎల్ మ్యాచ్లో మొత్తం 4 స్ట్రాటజిక్ టైమ్ ఔట్లు ఉంటాయి. ప్రతీ ఇన్నింగ్స్లో బౌలింగ్ జట్టుకు ఒకటి, బ్యాటింగ్ జట్టుకు ఒకటి చొప్పున రెండు టైమ్ ఔట్లు ఉంటాయి. ప్రతి టైమ్ ఔట్ నిడివి ఖచ్చితంగా 2 నిమిషాల 30 సెకన్లు ఉంటుంది. ఈ సమయంలో ఆయా జట్ల సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు సలహాలు సూచనలు ఇవ్వవచ్చు.
బౌలింగ్ జట్టు పవర్ ప్లే అనంతరం అంటే 6- 9వ ఓవర్ మధ్యలో ఎప్పుడైనా ఈ టైమ్ ఔట్ తీసుకోవచ్చు. బ్యాటింగ్ టీమ్ 13వ ఓవర్ నుంచి 16వ ఓవర్ మధ్య తీసుకొవాలి. టైమ్ ఔట్ కోసం కెప్టెన్లు అంపైర్లకు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కెప్టెన్లు టైమ్ ఔట్ కోరకపోతే నిర్ణీత సమయం తర్వాత(బౌలింగ్ టీమ్ 9వ ఓవర్ తర్వాత, బ్యాటింగ్ టీమ్కు 16వ ఓవర్ తర్వాత) అంపైర్లే స్వయంగా టైమ్ ఔట్ ప్రకటిస్తారు. అయితే తాజా మ్యాచ్లో 14వ ఓవర్ తర్వాత స్ట్రాటజిక్ టైమ్ ఔట్ ప్రకటించారు. అయితే తాను కోరలేదని రజత్ పటీదార్ చెప్పడంతో ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. అంపైర్లపై ఆర్సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ డేవిడ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్లతో 70 నాటౌట్), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రజత్ పటీదార్(19 బంతుల్లో ఫోర్, 6 సిక్స్లతో 48 నాటౌట్), ఫిల్ సాల్ట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 46), విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 28) దూకుడుగా ఆడారు.