అతని వల్లే ఈ ఓటమి: శ్రేయస్ అయ్యర్
తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అతను షాట్లను ఎంచుకున్న విధానం, గ్యాప్ షాట్స్ ఆడిన తీరు అమోఘమని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది.
ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్కు ఇది వరుసగా ఐదో పరాజయం. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తమ చివరి రెండు మ్యాచ్లకు రెండు గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.
ఎవర్నీ నిందించలేను..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఓటమికి తమ జట్టులో ఏ ఒక్కరిని నిందించలేనని చెప్పాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని తెలిపాడు. 'నిజానికి ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ ఈ మ్యాచ్లో ఏ ఒక్క సందర్భాన్ని వేలెత్తి చూపాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది గొప్ప మ్యాచ్.
ఇరు జట్లు అద్భుతంగా పోరాడాయి. తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా అతను షాట్లను ఎంచుకున్న విధానం బాగుంది. ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని తరలించిన తీరు అమోఘం. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా అతనికే దక్కుతుంది.

అతని వల్లే 200
మా జట్టులో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒకానొక సమయంలో మేం 170-180 పరుగులే చేస్తామని అనుకున్నాం. కానీ అజ్మతుల్లా దూకుడుగా ఆడి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మావైపు తిప్పాడు. ముఖ్యంగా అతను ఆడిన స్కూప్ షాట్స్, సిక్సర్లు 16, 17వ ఓవర్లో మాకు మూమెంటమ్ను అందించాయి. అతను చేసిన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతోనే మేం 200 పరుగులు చేయగలిగాం.
ఆర్సీబీతో జరిగే తదుపరి మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నాం. అది మధ్యాహ్నం జరిగే మ్యాచ్. మేం ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాలి. ఆ రెండు మ్యాచ్లు చాలా ఉత్సాహంగా ఉండబోతున్నాయి. ఈ మ్యాచ్ల కోసం వేచి చూడలేకపోతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
గెలిపించిన తెలుగోడు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులే చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 38) దూకుడుగా ఆడాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలుపొందింది . తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

