హాయ్గా చాయ్ తాగి.. బన్ మస్కా తింటా: సాయి సుదర్శన్
తన హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చడంపై గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఇన్నింగ్స్ గురించి మాట్లాడేందుకు తన దగ్గర మాటల్లేవని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సాయి సుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 87) హాఫ్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మాటల్లో చెప్పలేను..
ఈ సందర్భంగా మాట్లాడిన సాయి సుదర్శన్.. తన ఇన్నింగ్స్పై సంతోషం వ్యక్తం చేశాడు. 'నిజం చెప్పాలంటే.. ఈ ఇన్నింగ్స్ పట్ల కృతజ్ఞతో ఉన్నాను. నా సొంత గడ్డపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇన్నింగ్స్ గురించి చెప్పేందుకు నాకు మాటలు రావడం లేదు. కానీ అభిమానుల మద్దతు చూసి చాలా ఉద్వేగానికి లోనయ్యాను. నా హోమ్ గ్రౌండ్లో ఆడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
గత ఇన్నింగ్స్ నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని ఈ ఇన్నింగ్స్లో కూడా కొనసాగించాలని అనుకున్నాను. పరుగులు వస్తున్నాయా లేదా అనే దానికంటే, నేను ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాను అనే అంశానికే ప్రాధాన్యత ఇస్తున్నాను. ప్రతి మ్యాచ్ని కొత్త ఆరంభంగా చూస్తూ, ఆ ఆత్మవిశ్వాసాన్ని తదుపరి ఇన్నింగ్స్కు వాడుకుంటున్నాను.

చాయ్ తాగి సెలెబ్రేట్ చేసుకుంటా..
రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కాస్త సులువైంది. అయితే తొలి ఆరు ఓవర్లలో ఆడటం కష్టంగానే అనిపించింది. కానీ ఆ పవర్ప్లేలో మా ఆటగాళ్లు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ మమ్మల్ని మంచి స్థితిలో నిలబెట్టింది. నా బ్యాటింగ్ టెక్నిక్ విషయానికొస్తే.. బంతిని వీలైనంత ఆలస్యంగా ఆడటంపై నేను చాలా కసరత్తు చేస్తున్నా. ఆరంభ ఇన్నింగ్స్ల్లో నాకు సరైన రిథమ్ దొరకలేదు. కానీ ఒకసారి రిథమ్ వచ్చాక ఇప్పుడు అంతా సహజంగా జరుగుతోంది. ఇక నాకు ఇష్టమైన టీ షాప్కు వెళ్లి అక్కడ 'బన్ మస్కా'తింటూ.. 'చాయ్' తాగుతూ కొంత సమయం గడుపుతాను.'అని సాయి సుదర్శన్ చెప్పుకొచ్చాడు.
చెన్నైని ఓడించిన లోకల్ భాయ్
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 74 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబడా(3/25)మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 87) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శుభ్మన్ గిల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33), జోస్ బట్లర్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39 నాటౌట్)రాణించారు. నూర్ అహ్మద్, అకీల్ హుసేన్ చెరో వికెట్ తీసారు. గుజరాత్ టైటాన్స్కు ఇది నాలుగో విజయం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్కు ఐదో పరాజయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications