IPL 2026: బుమ్రా X బుడ్డోడు
ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా నేడు(మంగళవారం) జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ అద్భుతమైన మ్యాచ్లో ఓవైపు టీమిండియా దిగ్గజ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. మరోవైపు భారత క్రికెట్ భవిష్యత్తుగా ఎదుగుతున్న టీనేజ్ సెన్సేషన్, సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ ముఖా ముఖిగా తలపడనున్నారు.
ఈ ఇద్దరి మధ్య జరగబోయే పోరు కేవలం ఒక మ్యాచ్ ఫలితాన్ని మాత్రమే కాకుండా.. అభిమానులకు ఒక గొప్ప అనుభూతిని పంచనుంది. ఇప్పటి వరకు బుమ్రా, వైభవ్ సూర్యవంశీ ముఖా ముఖిగా తలపడలేదు. గతేడాది జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని దీపక్ చాహర్ డకౌట్ చేశాడు. దాంతో ఈ కుర్రాడికి బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనే అవకాశం దక్కలేదు.
సూపర్ ఫామ్లో బుడ్డోడు..
కానీ ఆ మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీ మరింత రాటు దేలాడు. తన ఆటతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అండర్-19 ప్రపంచకప్తో పాటు దేశవాళీ క్రికెట్లో రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ 2026 సీజన్ను కూడా ఈ 15 ఏళ్ల బిహార్ కుర్రాడు ఘనంగా ప్రారంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 18 బంతుల్లో 31 పరుగులతో దూకుడు కనబర్చాడు. సిక్సర్ల మోత మోగిస్తున్న ఈ కుర్రాడు.. ముంబై బౌలర్ల పని పట్టేందుకు సిద్దమయ్యాడు.

ఈ క్రమంలోనే బుమ్రా X బుడ్డోడు పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్ను కట్టడి చేసేందుకు ముంబై ఇండియన్స్.. బుమ్రానే తమ అస్త్రంగా ఉపయోగించనుంది. సూర్యవంశీ ఇంతవరకు ప్రొఫెషనల్ క్రికెట్లో బుమ్రాను ఎదుర్కోలేదు. పవర్ప్లేలోనే బుమ్రాను రంగంలోకి దించి రాజస్థాన్ ఓపెనర్లను కట్టడి చేయాలని హార్దిక్ సేన భావిస్తోంది. బుమ్రా బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా? లేక ఇతర బ్యాటర్లలా సరెండర్ అవుతాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
హార్దిక్ రీఎంట్రీ..
వరుసగా రెండు మ్యాచ్లకు రెండు గెలిచి జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్.. అదే ఊపులో ముంబైని చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి కోలుకొని మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్ ఉంది. అనారోగ్యం కారణంగా ఢిల్లీతో మ్యాచ్కు దూరమైన హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్తో బరిలోకి దిగనున్నాడు. దాంతో ముంబై ఇండియన్స్ తుది జట్టులో రెండు మార్పులు జరగనున్నాయి.
హార్దిక్ పాండ్యా బరిలోకి దిగితే.. అతని స్థానంలో ఆడిన దీపక్ చాహర్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అంతేకాకుండా కార్బిన్ బోష్పై వేటు పడనుంది. అతని స్థానంలో ట్రెంట్ బౌల్ట్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. హార్దిక్ గైర్హాజరీలో బ్యాటింగ్ డెప్త్ కోసం కార్బిన్ బోష్ను ఆడించాడు. ఈ రెండు మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications