ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 19 సీజన్లు ఆడిన ఏకైక క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్తో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, మనీష్ పాండేలు మాత్రమే 19 సీజన్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.
ఇందులో రోహిత్ శర్మ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్గా ఈ 19 సీజన్లు ఆడాడు. విరాట్ కోహ్లీ తొలి రెండు సీజన్లను అనామక ఆటగాడిగా ఆడగా.. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ధోనీ అనామక ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమై ఐదేళ్లు గడిచిన ఆటగాళ్లను అనామక ప్లేయర్గా పరిగణించాలనే కొత్త రూల్ను బీసీసీఐ ఐపీఎల్ 2023 సీజన్కు ముందు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్లోకి రోహిత్ శర్మ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007తోనే రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్కు ఆడిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్కు మారాడు. అతని సారథ్యంలో ముంబై ఐదు టైటిళ్లు గెలిచింది.
కేకేఆర్తో తాజా మ్యాచ్లో రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్తో కలిసి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ.. తన 19 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. ర్యాన్ రికెల్టన్ కూడా 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మ(38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78)ను వైభవ్ అరోరా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 148 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 67), అంగ్క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 51 ) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫిన్ అలెన్(17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 37), రింకూ సింగ్(21 బంతుల్లో 4 ఫోర్లతో 33 నాటౌట్) దూకుడుగా ఆడారు. ముంబై బౌలరల్లో శార్దూల్ ఠాకూర్(3/35) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు.