ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గత మ్యాచ్లో బుడ్డోడి చేతిలో ఎదురైన పరాజయం నుంచి ఆర్సీబీ త్వరగానే తేరుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆర్సీబీ టాప్-3 బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించగా.. బౌలర్లు సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా ముంబై పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50), రజత్ పటీదార్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. టీమ్ డేవిడ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34 నాటౌట్) ధాటిగా ఆడాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసి ఓటమిపాలైంది.
షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్(31 బంతుల్లో ఫోర్, 9 సిక్స్లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా..హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 40),ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లతో 33) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ(2/47) రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, జాకోబ్ డఫీ, రసీక్ధార్ తలో వికెట్ తీసారు.

241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. అయితే రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియోల సాయంతో బ్యాటింగ్ కొనసాగించే ప్రయత్నం చేసినా.. తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. దాంతో అతను రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. దాంతో 57 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
రోహిత్ శర్మ గాయపడకుండా కాసేపు క్రీజులో ఉండి ఉంటే ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇంకా బాగుండేది. ఇదే మైదానంలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రోహిత్-రికెల్టన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ముంబైని గెలిపించారు. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని అంతా ఆశించారు. కానీ రోహిత్ గాయం ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది.
పవర్ ప్లే అనంతరం సుయాశ్ శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. డేంజరస్ ర్యాన్ రికెల్టన్తో పాటు తిలక్ వర్మ(1)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ మెరుగ్గా ఆడినా.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో సూర్య, హార్దిక్ వెనుదిరిగారు. తర్వాత వచ్చిన నమన్ ధీర్(1) కూడా విఫలమవడంతో ముంబై ఓటమి ఖాయమైంది. చివర్లో రూథర్ఫోర్డ్ పోరాడినా ఫలితం లేకపోయింది.