దురదృష్టకరమైన రీతిలో తాను రాంగ్ టైమ్లో రనౌటవ్వడం, బౌలింగ్లో ఎక్కువగా ఎక్స్ట్రాలు సమర్పించుకోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసాయని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. తమ బ్యాటర్లు భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారని, దాంతో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం లక్నో వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషభ్ పంత్.. బ్యాటింగ్ వికెట్పై కావాల్సిన పరుగులు చేయలేకపోయామని తెలిపాడు. ఈ మ్యాచ్లో ఓడినా తమ బౌలర్ల ప్రదర్శన సానుకూల అంశమని పేర్కొన్నాడు.

'నా దురదృష్టకరమైన రనౌట్ను వీలైనంత త్వరగా మరిచిపోవడం మంచిదని నేను భావిస్తున్నా. తదుపరి మ్యాచ్లకు సిద్దం కావాలంటే ఆ రనౌట్ను మరిచిపోవాలి. ఎందుకంటే మన నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనం వెనుకబడిపోతాం. మా బ్యాటింగ్లో మేం కావాల్సిన భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం. దాంతో బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాల్సి వచ్చింది. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్పై మేం త్వరగా వికెట్లు కోల్పోయాం.

లెఫ్ట్ రైట్ కాంబినేషన్ నేపథ్యంలోనే ఆయుష్ బదోనిని అప్ది ఆర్డర్ ఆడించాం. అలా చేస్తే ప్రత్యర్థి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్తో బౌలింగ్ చేయించలేరని మేం భావించాము. దురదృష్టవశాత్తు నేను రాంగ్ టైమ్లో ఔట్ అయ్యాను. లేదంటే అక్షర్ పటేల్ పవర్ ప్లేలో మరో ఓవర్ వేయాల్సి వచ్చేది. అప్పుడు మాకు కలిసి వచ్చేది. కానీ ఆటలో ఇవన్నీ సహజం. కష్టకాలంలో జట్టు వికెట్లు త్వరగా కోల్పోయినప్పుడు బదోని తనదైన ముద్ర వేయాలని మేం కోరుకుంటున్నాం
కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతం ప్రదర్శన కనబర్చారు. కానీ 140 పరుగులు చేసినప్పుడు ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడం కష్టం. ముఖ్యంగా ఇలాంటి బ్యాటింగ్ వికెట్పై ఆ స్కోర్ ఏమాత్రం సరిపోదు. కానీ మా బౌలర్లు గట్టిగా పోరాడారు. మా బౌలింగ్ అప్కమింగ్ మ్యాచ్లకు మంచి సంకేతం.
20 ఎక్స్ట్రాలు సమర్పించుకోవడం మా విజయవకాశాలను దెబ్బతీసాయి. కానీ 140 వంటి తక్కువ స్కోరు ఉన్నప్పుడు ప్రత్యర్థిని ఔట్ చేయడానికి బౌలర్లు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలోనే ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే వారు సాధారణంగా ఆడినా మ్యాచ్ గెలుస్తారు. కానీ ఆరంభంలో కొన్ని కీలక వికెట్లు తీయడం వల్ల వారిని ఒత్తిడిలోకి నెట్టగలిగాం. ఈ సీజన్ మొత్తం నేనే ఓపెనర్గా ఆడుతానని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. ఇది 50-50 నిర్ణయం. కానీ నేను టాపార్డర్లోనే ఆడుతాను.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 35), అబ్దుల్ సమద్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడితో పాటు నటరాజన్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 70 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 39 నాటౌట్) రాణించారు. బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్సిన్ నఖ్వీ తలో వికెట్ తీసారు.