ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ పంత్ సేన ఓటమిపాలైంది. కోల్కతా నైట్రైడర్స్(KKR)తో లక్నో వేదికగా ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఓవర్లో చిత్తయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఆ జట్టు పతనాన్ని శాసించింది.
ఈ టోర్నీలో పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న నికోలస్ పూరన్ను సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు పంపించి లక్నో మూల్యం చెల్లించుకుంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్ తొలి బంతికే నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి పంత్ సింగిల్ తీసివ్వగా.. మూడో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఎయిడెన్ మార్క్రమ్ క్యాచ్ ఔటయ్యాడు.

బౌండరీ లైన్పై రింకూ సింగ్తో కలిసి రోవ్మన్ పోవెల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్తో మార్క్రమ్ పెవిలియన్ చేరాడు. సూపర్ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ 3 బంతుల్లోనే ముగియగా.. ఆ జట్టు ఒక్క పరుగు మాత్రమే చేసింది. కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ తొలి బంతినే బౌండరీ తరలించి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఓ సందర్భంగాలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగి సూపర్ ఓవర్కు దారి తీసింది. లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మహమ్మద్ షమీ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మరి మ్యాచ్ను టై చేసినా ఆ జట్టుకు ఫలితం లేకుండా పోయింది. రింకూ సింగ్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన.. సంచలన ఫీల్డింగ్ కేకేఆర్కు విజయాన్నందించాయి. ఈ మ్యాచ్లో రింకూ సింగ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు ఫీల్డింగ్లో 5 క్యాచ్లు అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులే చేసింది. రింకూ సింగ్(51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 83 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 3 సిక్స్లతో 34) పర్వాలేదనిపించాడు. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోహ్సిన్ ఖాన్(5/23) ఐదు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఎయిడెన్ మార్క్రమ్(27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31), రిషభ్ పంత్(38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 42), ఆయుష్ బదోని(19 బంతుల్లో 2 సిక్స్లతో 24) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(2/24), వరుణ్ చక్రవర్తీ(2/33) రెండేసి వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్, కామెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగీ తలో వికెట్ తీసారు.
ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగీ 16 పరుగులివ్వడంతో మ్యాచ్ టై అయ్యింది. ఈ ఓవర్ తొలి ఐదు బంతుల్లో రెండో నోబాల్స్తో ఒక వికెట్ తీసిన కార్తీక్ త్యాగీ.. ఆఖరి బంతికి సిక్సర్ సమర్పించుకున్నాడు.