మా ఓటమికి అదే కారణం: రిషభ్ పంత్
డ్యూ కారణంగానే 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో కండిషన్స్ బ్యాటింగ్కు అనుకూలంగా మారాయని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఘోర పరాజయంతో ఈ సీజన్ను ముగించింది. 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగుస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్.. ఈ సీజన్ తమకు కలిసి రాలేదన్నాడు. కానీ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని, వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని తెలిపాడు.
మంచు ముంచింది..
'ఈ సీజన్లో మా ప్రదర్శనను జీర్ణించుకోవడం కష్టమైన విషయమే. కానీ ఈ చేదు నిజాల్ని అంగీకరించి తీరాలి. తల ఎత్తుకుని ముందుకు సాగాలి. ఈ సీజన్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఇది మాకు చాలా కష్టమైన సీజన్. ఈ మ్యాచ్లో మేం బోర్డుపై తగినన్ని పరుగులు ఉంచామనే అనుకుంటున్నాను. అయితే రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మంచు కారణంగా బ్యాటింగ్ సులువుగా మారుతుంది. అందుకే ప్రతి జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడానికి ఇష్టపడతారు.

బలంగా తిరిగి వస్తాం..
ఒక జట్టుగా మేం సానుకూల విషయాలను చూడాలనుకుంటున్నాం. జోష్ ఇంగ్లిస్, మిచ్ మార్ష్, ప్రిన్స్ యాదవ్ ఈ సీజన్లో అద్భుతంగా రాణించారు. గాయం నుంచి కోలుకుని మోహ్సిన్ ఖాన్ తిరిగి రావడం... షమీ భాయ్ ప్రదర్శన.. ఇవన్నీ మాకు సానుకూల అంశాలు. ఇది చాలా సుదీర్ఘమైన సీజన్. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని మేం ప్రామిస్ చేస్తున్నాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్ ..
శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 104 నాటౌట్) అజేయ శతకంతో 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ(2/45) రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్(1/36) ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 72) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆయుష్ బదోని(18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 43), అబ్దుల్ సమద్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications