వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే ఓటమిపాలయ్యామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. విధ్వంసకర బ్యాటింగ్తో పవర్ ప్లేలోనే ఈ సిక్సర పిడుగు మ్యాచ్ను లాగేసుకున్నాడని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శుక్రవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోసాడు. వరల్డ్ బెస్ట్ బౌలర్లు అయిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ను చితక్కొట్టాడు.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. తమ ఓటమికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీనే అని తెలిపాడు. 'పవర్ప్లేలో మేం దూకుడుగా ఆడిన విధానం, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా 202 పరుగులు సాధించడం మాకు సానుకూల అంశాలు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ పవర్ప్లేలో బ్యాటింగ్ చేసిన తీరు మా విజయవకాశాలను దెబ్బతీసింది.

గత మ్యాచ్ల్లో మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. అయితే ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బౌలింగ్ మార్పుల గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా మాత్రమే నాకు ఆప్షన్స్గా ఉన్నారు. మేం ఈ ముగ్గురితోనే ఓవర్లను మేనేజ్ చేయాల్సి వచ్చింది.
బౌలింగ్ మార్పులు ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేదని నేను అనుకుంటున్నాను. ఐపీఎల్ వంటి అత్యంత పోటీతత్వంతో కూడిన క్రికెట్ ఆడుతున్నప్పుడు తప్పులు జరగడం సహజం. కానీ ఆ తప్పుల నుంచి పాఠాలు ఎలా నేర్చుకుంటారనేదే కీలకం. మా తప్పిదాలను సవరించుకొని తదుపరి మ్యాచ్కు బలంగా తిరిగి వస్తాం'అని రజత్ పాటిదార్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులే చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్(40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 7 ఫోర్లతో 32), వెంకటేశ్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29 నాటౌట్) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/33), రవి బిష్ణోయ్(2/32), బ్రిజేశ్ శర్మ(2/37) రెండేసి వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ(1/47), రవీంద్ర జడేజా(1/14) చెరో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78), ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 81 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(2/44), కృనాల్ పాండ్యా(2/30) రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు చేతులెత్తేసారు.