ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఒక మార్పుతో బరిలోకి దిగింది. తమ ప్రధాన పేసర్ హాజెల్వుడ్ను పక్కనపెట్టింది. అయితే జాకోబ్ డఫీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు. గాయంతో ఆరంభ మ్యాచ్కు దూరమైన హాజెల్ వుడ్.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన గత మ్యాచ్ ఆడాడు. మెరుగైన బౌలింగ్ ప్రదర్శనే కనబర్చాడు. కానీ ఆ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించలేదు.
మరోవైపు హాజెల్ వుడ్ గైర్హాజరీలో ఆడిన జాకోబ్ డఫీ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. దాంతో అతన్నే మళ్లీ తుది జట్టులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని టాస్ సందర్భంగా రజత్ పటీదార్ వెల్లడించాడు. 'టాస్ గెలిస్తే మేం కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. కానీ ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే వికెట్. బంతి మంచి బౌన్స్తో ముద్దుగా బ్యాట్పైకి వస్తుంది. కాబట్టి టాస్ ఓడినా జరిగే నష్టం ఏం లేదు.

మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేసి ముంబైని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది మాకు నాలుగో మ్యాచ్. గత మూడు మ్యాచ్లో మాకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. గత మ్యాచ్లో 97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా 200 ప్లస్ రన్స్ చేయగలిగాం. అది మాకు కలిసొచ్చే అంశం. ఇక్కడ ఆటను మేం చాలా ఆస్వాదిస్తాం. మేం ఎప్పుడు వచ్చినా ఇక్కడ మాకు అభిమానుల మద్దతు లభిస్తుంది. జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. హాజెల్ వుడ్ స్థానంలో జాకోబ్ డఫీ తిరిగి వచ్చాడు.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది ఫ్రెష్ వికెట్. వాంఖడేలో ఛేజింగ్ చేయడం ఈజీ. ఇది చాలా బిగ్ మ్యాచ్. మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ క్రికెట్ ఆడాలని, ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని చర్చించుకున్నాం. ఆటను ఆస్వాదించాలనుకుంటున్నాం.
మేం కోరుకున్నట్లుగానే మంచి వికెట్స్ లభిస్తున్నాయి. బౌలర్గా బంతిని సరైన చోట వేసి.. బ్యాటర్గా సరైన షాట్లు ఆడినంత కాలం మ్యాచ్లో నిలబడుతారు. చాలా ఏళ్లుగా వాంఖడేలో ఛేజింగ్ టీమ్స్ గెలుస్తున్నాయి. ఇది మా హోమ్ గ్రౌండ్. మంచు ప్రభావం కూడా ఉంటుంది. లక్ష్యం ఎంతో తెలిస్తే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. దీపక్ చాహర్, గజన్ ఫర్ స్థానాల్లో మయాంక్ మార్కండే, మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.