రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ధ్రువ్ జురెల్ బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆ ఫ్రాంచైజీ పెట్టిన పోస్ట్ ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ను జట్టు వీడేందుకు ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సిద్దమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తనను రిలీజ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్కు సంజూ శాంసన్ సమాచారమిచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో విభేదాలు తలెత్తడంతోనే సంజూ శాంసన్ జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కూడా సంజూకు మంచి ఆఫర్ వచ్చిందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. దులీప్ ట్రోఫీలో ధ్రువ్ జురెల్ సెంట్రల్ జోన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాజస్థాన్ రాయల్స్ ఓ పోస్ట్ను షేర్ చేసింది.

'స్టంప్స్ వెనుక ఉండి మ్యాచ్ను మార్చేసే ప్లేయర్ అతడు'అని క్యాప్షన్ ఇచ్చింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతలు ధ్రువ్ జురెల్కు దక్కుతాయా? అనే చర్చ మొదలైంది. అయితే సంజూ శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు. అంతేకాకుండా యశస్వి జైస్వాల్ రూపంలో జట్టులో మరో సీనియర్ ఆటగాడు ఉన్నాడు. ఈ ఇద్దర్నీ కాదని ధ్రువ్ జురెల్కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం లేదని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఆగస్ట్ 28 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి టెస్ట్కు రిషభ్ పంత్ దూరమవ్వడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న ధ్రువ్ జురెల్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. వికెట్ కీపర్గా కూడా ధ్రువ్ జురెల్ తడబడ్డాడు.