ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో బ్యాటర్ల ఆధిపత్యం నడిచింది. సిక్సర్ల మోత మోగిన గత రెండు మ్యాచ్ల్లో బౌలర్లు తేలిపోయారు. మొన్న(శనివారం) జరిగిన ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 201 పరుగులు చేస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 221 పరుగులు చేస్తే.. ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో బ్యాటర్ల విధ్వంసం చూసి అభిమానులకు మూడో మ్యాచ్లో మాత్రం వింత అనుభవం ఎదురైంది.

వర్షప్రభావం ఉన్న ఈ మ్యాచ్లో బంతి బుసలు కొట్టింది. మ్యాచ్కు ముందు భారీ వర్షం కారణంగా పిచ్ కవర్లపై కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి బౌలర్లకు అడ్వాంటేజ్గా మారింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు నిప్పులు చెరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు.
పవర్ ప్లేలోనే సంజూ శాంసన్(6), రుతురాజ్ గైక్వాడ్(6), ఆయుష్ మాత్రే(0), మాథ్యూ షార్ట్ వికెట్లను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ 41 పరుగులే చేసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పిచ్ కండిషన్స్ను పట్టించుకోకుండా గుడ్డిగా ఆడి మూల్యం చెల్లించుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్(17), శివమ్ దూబే(6) చెత్త షాట్లతో వెనుదిరగ్గా.. రూ.14.20 కోట్ల కార్తీక్ శర్మ 18 పరుగులే చేశాడు.
నూర్ అహ్మద్(1), మ్యాట్ హెన్రీ(5) చేతులు ఎత్తేయగా.. అన్షుల్ కంబోజ్(7 నాటౌట్)తో కలిసి జెమీ ఓవర్టన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 43) ఆచితూచి ఆడి జట్టుకు 127 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ ఇద్దరూ ఆఖరి వికెట్కు 33 పరుగులు జోడించారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/19), నండ్రే బర్గర్(2/19), రవీంద్ర జడేజా(2/18) రెండేసి వికెట్లు తీయగా.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
గౌహతి మైదానంలో ఇదే అత్యల్ప స్కోర్. 2023లో గౌహతి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ 142/9 స్కోర్ చేయగా.. 2024లో పంజాబ్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ 144/9 స్కోర్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్పై ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కు ఇది రెండో అత్యల్ప స్కోర్. 2008లో జైపూర్లో 109 పరుగులకు ఆలౌటైన సీఎస్కే తాజా మ్యాచ్లో 127 పరుగులకు కుప్పకూలింది.