రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన అదనపు బాధ్యతలను స్వీకరించేందుకు ద్రవిడ్ నిరాకరించినట్లు పేర్కొంది. రాహుల్ ద్రవిడ్ అందించిన సేవలకు రాజస్థాన్ రాయల్స్ కృతజ్ఞతలు తెలిపింది.
'పింక్ జెర్సీలో మీ ఉనికి యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులకు కూడా స్ఫూర్తినిచ్చింది. మీరు ఎప్పటికీ ఒక రాయల్. మీ సేవలకు ధన్యవాదాలు'అనే క్యాప్షన్తో వీడ్కోలు పోస్ట్ను షేర్ చేసింది.
మరో పోస్ట్లో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసిందని పేర్కొంది. 'రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. రాహుల్ చాలా ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ ప్రయాణంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన నాయకత్వం ఒక తరాన్ని ప్రభావితం చేసింది. జట్టులో బలమైన విలువలను నింపింది. ఫ్రాంచైజీ సంస్కృతిపై చెరగని ముద్ర వేసింది.

ఫ్రాంచైజీ నిర్మాణ సమీక్షలో భాగంగా.. రాహుల్కు అదనపు బాధ్యతలు ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కానీ ఆయన అందుకు నిరాకరించారు. రాజస్థాన్ రాయల్స్తో పాటు ఆటగాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు రాహుల్ ద్రవిడ్ సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.'అని పేర్కొంది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 46 మ్యాచ్లు ఆడిన ద్రవిడ్.. గతేడాది హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ద్రవిడ్.. ఐపీఎల్లో కోచ్గా రీఎంట్రీ ఇచ్చాడు.
అతని పర్యవేక్షణలో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచింది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు వేటుకు గురైన రెండో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ నిలిచాడు. ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్ తమ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి చంద్రకాంత్ పండిట్ను తప్పించింది. ఐపీఎల్ 2023 సీజన్కు ముందు అతను ఆ జట్టులో చేరగా.. ఐపీఎల్ 2024 టైటిల్ను కేకేఆర్ గెలుచుకుంది. కానీ ఐపీఎల్ 2025 సీజన్లో మాత్రం దారుణంగా విఫలమైంది.