టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున తాను ఆడిన చివరి ఐపీఎల్ సీజన్ చాలా కష్టంగా సాగిందని, మానసికంగా అసౌకర్యంగా అనిపించిందని చెప్పాడు. దాంతోనే ఐపీఎల్ వీడ్కోలు పలికానని తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అశ్విన్ వెల్లడించాడు.
గతేడాది ఆగస్టులో అశ్విన్ ఐపీఎల్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనా.. ఐపీఎల్లో తన హోమ్ టీమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో (10 మ్యాచ్ల్లో 4 విజయాలు) పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 9.12 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీసాడు.

ఐపీఎల్ 2026 సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 43 పరుగులతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'సీఎస్కేతో గడిపిన ఆ నిరాశాజనకమైన సీజన్ నన్ను వ్యక్తిగతంగా ఎంతో కుంగదీసింది. మరో సీజన్ ఆడే సత్తా నాకు ఉండొచ్చు. కానీ మానసికంగా ఆ ధైర్యం లేదు. ఆ స్థితి అత్యంత బాధాకరం. నరకం. మళ్ళీ అటువంటి మానసిక స్థితిలోకి వెళ్లడం నాకు ఇష్టం లేకనే ఐపీఎల్కు గుడ్బై చెప్పాను.
నేను రిటైర్ అవ్వడం వల్ల జట్టుకు మంచే జరిగింది(నవ్వుతూ). నన్ను రిలీజ్ చేయాలా వద్దా అనే తలనొప్పి సీఎస్కే యాజమాన్యానికి తప్పింది. నా రిటైర్మెంట్ వల్ల వారికి వేలంలో అదనంగా రూ. 10 కోట్లు లభించాయి. ఆ మొత్తంతో జట్టును బలోపేతం చేసే అవకాశం దొరికింది.
ఆర్సీబీతో మ్యాచ్లో సీఎస్కే ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. సీఎస్కే జట్టుపై నేను చాలా అంచనాలు పెట్టుకున్నాను. కానీ ఆర్సీబీ అసాధారణ ప్రదర్శనతో ఇతర జట్లకు హెచ్చరిక జారీ చేసింది. బౌలర్ల బలాన్ని నమ్మకుండా వారి చేత వైడ్ యార్కర్లు వేయించేందుకు సీఎస్కే ప్రయత్నించింది. ఇది ఏ మాత్రం సరికాదు.
జట్టులో యువ ఆటగాళ్లు ఉన్నారు, వారు త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేదంటే ఈ సీజన్లో సీఎస్కే కోలుకోవడం కష్టం.' అని అశ్విన్ హెచ్చరించాడు.