ఐపీఎల్ 2026 సీజన్కు ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ఓపెన్ కావడంతో తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం సహచర ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తీవ్రంగా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. సంజూను వదులుకునేందుకు సిద్దమైన రాజస్థాన్ రాయల్స్.. అతనికి బదులుగా రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మతీష పతీరణల్లో ఇద్దర్ని ఇవ్వాలని కోరిందంట. అందుకు సీఎస్కే అంగీకరించకపోవడం ఈ డీల్ కుదరలేదని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ కోసం ముంబై ఇండియన్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రేడింగ్ డీల్ ద్వారా ఖలీల్ అహ్మద్ను తమకు ఇవ్వాలని సీఎస్కే ఫ్రాంచైజీని ముంబై కోరిందంట. అతనికి బదులుగా దీపక్ చాహర్ను ఇస్తామనే ఆఫర్ కూడా ఇచ్చిందంట. ఐపీఎల్ 2025 సీజన్లో ఖలీల్ అహ్మద్ 14 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మరోవైపు ముంబై తరఫున దీపక్ చాహర్ 14 మ్యాచ్ల్లో 11 వికెట్లే తీసాడు.

దీపక్ చాహర్.. సీఎస్కే తరఫున సుదీర్ఘ కాలం ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతని కోసం సీఎస్కే బాగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఖలీల్ అహ్మద్ కోసం దీపక్ను వదులుకుంటామని ముంబై ఇండియన్స్ ఆఫర్ ఇచ్చిందంట. ఈ ఆఫర్ను సీఎస్కే స్వీకరిస్తుందా? తిరస్కరిస్తుందా? అనేది చూడాలి. దీపక్ చాహర్ వయసు 33 ఏళ్లు కాగా.. ఖలీల్ అహ్మద్కు 27 ఏళ్లు. అంతేకాకుండా దీపక్ చాహర్ తరుచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలోనే ఈ డీల్కు అంగీకరించవద్దని సీఎస్కే ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరిగే అవకాశం ఉంది. అంతకు నెల రోజుల ముందే ఫ్రాంచైజీలు తమ రిలీజ్, రిటైన్ లిస్ట్లు ప్రకటించనున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ మొదలయ్యే వరకు ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత వేలం ముగిసిన తర్వాత మరోసారి ఈ విండో ఓపెన్ అవుతుంది.