చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్కు గుడ్బై చెప్పే సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వ్యవహరించిన తీరు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ధోనీని సీఎస్కే రిటైన్ చేసుకున్నా.. అతను ఈ సీజన్ మధ్యలోనే వైదొలిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీజన్ మొత్తం ఆడినా.. అతను బ్యాటింగ్కే పరిమితం అవుతాడని సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి. సీఎస్కేకు ఉన్న క్రేజ్ పడిపోవద్దనే ధోనీని జట్టులో కొనసాగిస్తున్నారనే అభిప్రాయం ఉంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ధోనీకి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్దం చేస్తోంది. ఇప్పటికే సంజూ శాంసన్ను ట్రేడ్ చేసుకున్న సీఎస్కే అతని కోసం రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్ను కూడా వదులుకుంది. రూ.18 కోట్ల భారీ ధరతో జట్టులోకి తెచ్చుకుంది. ఇక వేలంలో అనామక వికెట్ కీపర్ కార్తీక్ శర్మపై కోట్లు కురిపించింది.
ఇతర ఫ్రాంచైజీలతో తీవ్రంగా పోటీపడి 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సంజూ శాంసన్తో పాటు కార్తీక్ శర్మ కోసమే సీఎస్కే రూ.32.20 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ధోనీకి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ను తయారు చేయాలనే ఉద్దేశంతోనే సీఎస్కే ఇంతలా ఖర్చు పెట్టిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

44 ఏళ్ల ధోనీ కెరీర్ చివరి దశలో ఉన్నాడు. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం సీఎస్కే అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు. మునపటిలా రాణించలేకపోతున్నా.. అతని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సీఎస్కే మ్యాచ్ ఎక్కడ జరిగినా.. మైదానాలు పసుపు మయమవుతున్నాయి. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంజూ శాంసన్ కీపింగ్ చేయనుండగా.. అతనికి కీపర్ కార్తీ శర్మ బ్యాకప్గా ఉండనున్నాడు. ఇప్పటికే ఉర్విల్ పటేల్ రూపంలో మూడో వికెట్ కీపర్ సీఎస్కేకు అందుబాటులో ఉన్నాడు. 2008 నుంచి ధోనీపైనే ఆధారపడిన సీఎస్కే.. ఇప్పుడు అతని ప్రత్యామ్నాయ ఆటగాడిని సిద్దం చేసే పనిలో పడింది.
సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. 'ఏదో ఒక రోజు ధోనీ జట్టుకు దూరమవుతాడని మనం గుర్తుంచుకోవాలి. సంజూ శాంసన్ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతను తన బాధ్యతలను సమర్థవంతగా నిర్వర్తిస్తాడు. గతంలోలా పాత శైలి ఆటను కొనసాగించలేం. మేం మారాల్సిన సమయం ఆసన్నమైంది.'అని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ధోనీకి ఇదే చివరి సీజన్ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గత సీజన్లోనే ధోనీనే ఈ విషయం చెప్పాడని గుర్తు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా రూ.4 కోట్ల ధరతోనే కొనసాగుతున్న ధోనీ.. ఈ సీజన్ మధ్యలోనే వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతని ప్రత్యామ్నాయం కోసం సీఎస్కే రూ. 32.20 కోట్లు ఖర్చు చేసింది.