ఐపీఎల్లో తమ జట్టు ఐదు టైటిల్స్ గెలిచిందని, కొన్ని జట్లు ఇంకా ఒక్క ట్రోఫీ కూడా అందుకోలేదని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. గత ఐదేళ్లుగా ముంబై టైటిల్ గెలవలేదు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా.. కొన్ని జట్లు ఒక్క టైటిల్ కూడా గెలవలేదని గుర్తు చేశాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ తర్వాతి ఐదు సీజన్లలో ఫైనల్ చేరలేకపోయింది. ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించి 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ముంబై ఇండియన్స్.. అదే జోరు కనబర్చాలనే లక్ష్యంతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జయవర్దనే మాట్లాడాడు. ఐపీఎల్లో పోటీ అత్యంత కఠినంగా ఉంటుందని చెప్పాడు.

'పది జట్లతో కూడిన ఐపీఎల్లో పోటీ చాలా కఠినంగా ఉంటుంది. గత ఐదేళ్లలో మేం టైటిల్ గెలవలేకపోయాం. కానీ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాం. కాబట్టి మేం సరిగ్గా ఆడలేదనే ప్రశ్నే అనవసరం. గత కొన్నేళ్లుగా తమ జట్టు నిలకడగా రాణిస్తోంది. మా ప్రాసెస్పై మాకు నమ్మకం ఉంది. ఇక ముందూ భిన్నంగా చేయాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల నుంచి మేం టైటిల్ గెలవలేదు. కానీ ఇప్పటికీ ఒక్క టైటిలూ నెగ్గని జట్లూ ఉన్నాయి. కాబట్టి, దాని గురించి మేం ఆందోళన చెందడం లేదు.'అని మహేల జయవర్దనే స్పష్టం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 35) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీసారు. అనారోగ్యంతో ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా దూరం కాగా.. సూర్యకుమార్ యాదవ్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు.
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి సార్లు విజేతగా నిలవగా.. కేకేఆర్ మూడు టైటిల్స్ అందుకుంది. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), డెక్కన్ ఛార్జర్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కో టైటిల్ గెలిచాయి.