ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఘోర తప్పిదం చేసిందని మాజీ కెప్టెన్, తమిళనాడు క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ అన్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ను తీసుకోకపోవడమే సీఎస్కే చేసిన అతిపెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డాడు. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో రూ.43.40 కోట్ల భారీ పర్స్ మనీతో బరిలోకి దిగిన సీఎస్కే 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
అనామక ఆటగాళ్లైన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను రూ.14.20 కోట్ల చొప్పున కొనుగోలు చేసిన సీఎస్కే.. రాహుల్ చాహర్ను రూ.5.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అకీల్ హోస్సేన్ను రూ.2 కోట్లకు కొన్న సీఎస్కే.. మాథ్యూ షార్ట్ (రూ.1.5 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్(రూ.75 లక్షలు)లను తీసుకుంది.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ కోసం సీఎస్కే బాగానే ప్రయత్నించింది. రూ.9 కోట్ల వరకు బిడ్ వేసి వెనకడుగు వేసింది. దాంతో కేకేఆర్ రూ.9.20 కోట్లకు ముస్తాఫిజుర్ రెహ్మాన్ను చేజిక్కించుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని క్రిష్ శ్రీకాంత్ తప్పుబట్టాడు. మతీష పతీరణను వదిలేసిన నేపథ్యంలో ముస్తాఫిజుర్ను కొనుగోలు చేయాల్సిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. అతని కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసినా ఏం అయ్యేది కాదని తెలిపాడు. తుది జట్టులో లేని ఆటగాడి కోసం రూ.14.20 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని అసహనం వ్యక్తం చేశాడు.

'ముస్తాఫిజుర్ను కొనుగోలు చేయకుండా సీఎస్కే తప్పిదం చేసింది. పతిరణను వదిలేసినప్పుడు ముస్తాఫిజుర్ను కొనుగోలు చేయాల్సింది. రూ.12, రూ.15 కోట్లకు వెళ్లినా బిడ్ వేయాల్సింది. అతనిలాంటి బౌలర్ సీఎస్కే చాలా అవసరం. వారికి ముస్తాఫిజుర్ లాంటి డెత్ బౌలర్ లేడు. భారీ ధరకు కొనుగోలు చేసిన కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్లో ఒకరు మాత్రమే తుది జట్టులో ఆడుతారు. అకీల్ హుస్సేన్ను తుది జట్టులో ఆడించాలి. అతను జడేజా తరహాలో బౌలింగ్ చేయగలడు. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు. నూర్ అహ్మద్పైనే పూర్తిగా ఆధారపడలేం. కాబట్టి అకిల్ హుస్సేన్ను తుది జట్టులో ఆడించాలి.
ప్రశాంత్ వీర్ ఎలా బౌలింగ్ చేస్తాడో మనకు ఇంకా తెలియదు. ప్రస్తుతం సీఎస్కే కుర్రాళ్ల వైపు వెళ్తోంది. రాహుల్ చాహర్ను కొనుగోలు చేయడం కూడా మంచి ఎంపిక. అతను ఇప్పటికే తన సామర్థ్యం ఏంటో చాటుకున్నాడు. ఐపీఎల్లో బాగా రాణించాడు. అతని తీరులో తేడా ఉండవచ్చు. కానీ చెడ్డ బౌలర్ కాదు. చెన్నైలాంటి పిచ్లపై అతను బాగా రాణిస్తాడు. గతంలో సీఎస్కేపై పంజాబ్ విజయంలో రాహుల్ చాహర్ కీలక పాత్ర పోషించాడు. రాహుల్ చాహర్, నూర్ అహ్మద్ బాగా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లు ఇబ్బంది పడుతాయి.
చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ల్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి. రాహుల్ చాహర్, అఖిల్ హుస్సేన్లతో పాటు నూర్ అహ్మద్ను ఆడించాలి. అన్షుల్ కాంబోజ్ను పక్కనపెట్టాలి. శివమ్ దూబేను మూడో పేసర్గా ఉపయోగించుకోవాలి.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.