ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఎంతకు వర్షం తగ్గకపోవడంతో కటాఫ్ సమయం వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
చివర్లో వర్షం తగ్గినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని చెప్పిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలో 25 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు పంజాబ్ కింగ్స్ జేవియర్ బార్ట్లెట్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. రెండో ఓవర్లోనే ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్లను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. శుభారంభం చేసిన మ్యాచ్లో వర్షం అడ్డంకిగా మారడంతోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు.
వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్న పంజాబ్ కింగ్స్.. ఈ మ్యాచ్ కూడా గెలిచి తమ జైత్రయాత్రను కొనసాగించాలని భావించింది. కానీ వారి ఆశలపై వరణుడు నీళ్లు జల్లాడు. యాదృశ్చికమో ఏమో కానీ గతేడాది కూడా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడుచుకుపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్లో 36.2 ఓవర్ల ఆటను వరణుడు మింగేసాడు.
ఈ మ్యాచ్ రద్దవ్వడం పంజాబ్ కింగ్స్కు నష్టం చేస్తే.. కేకేఆర్ మరో ఓటమి నుంచి బచాయించిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 3 బంతుల వ్యవధిలోనే డేంజరస్ బ్యాటర్లు అయిన ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్ వికెట్లు కోల్పోయిన కేకేఆర్.. ఈ మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే గెలిచేది కాదని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడాన్ని శ్రేయస్ అయ్యర్ తట్టుకోలేకపోయాడని, ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచాడని కామెంట్ చేస్తున్నారు.