టాప్-3 బ్యాటర్ల వైఫల్యంతో పాటు పేలవ బౌలింగ్ తమ ఓటమికి ప్రధాన కారణమని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు. టాపార్డర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
సన్రైజర్స్ విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఇషాన్ కిషన్.. అసాధారణ బ్యాటింగ్తో విరాట్ కోహ్లీ తమ ఓటమిని శాసించాడని చెప్పాడు. విరాట్ కోహ్లీని వీలైనంత త్వరగా ఔట్ చేయాలని, అతను క్రీజులో సెట్ అయితే ఔట్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. ఇరు జట్లకు పిచ్ భిన్నంగా స్పందించిందని తెలిపాడు.

'మొదటి 3-4 ఓవర్ల తర్వాత పిచ్ బ్యాటింగ్కు అనుకూలించింది. మేం ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాం. ఈ విషయంపై మేం ఫోకస్ పెట్టాలి. రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింత ఈజీగా మారింది. బంతి ముద్దుగా బ్యాట్పైకి వచ్చింది. అప్కమింగ్ మ్యాచ్లో మా షాట్ సెలెక్షన్ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలి.
ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న తీరు మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మా బ్యాటర్ల ప్రదర్శనను కూడా అభినందించాలి. ఇక ఛేజింగ్లో విరాట్ భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. అతని వికెట్ను సాధ్యమైనంత త్వరగా తీయడం చాలా ముఖ్యం. అతను క్రీజులో సెట్ అయితే ఆపడం చాలా కష్టం.

జట్టుగా మేం కొంచెం కష్టపడాల్సి ఉంది. ఇది తొలి మ్యాచ్ మాత్రమే కాబట్టి ఇలాంటి పొరపాట్లు ప్రస్తుతానికి ఆమోదయోగ్యమే. బౌలింగ్ విభాగంలో ఏ ఏరియాల్లో మెరుగుపడాలి, ప్లాన్స్ని ఎలా అమలు చేయాలి అనే విషయాల్లో మేము మరింత జాగ్రత్త వహించాలి. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకుని మేం ఇంకా బలంగా తయారవుతాం. వ్యక్తిగతంగా నేను ఈ మ్యాచ్ను చాలా ఆస్వాదించాను. ఇది ఐపీఎల్ కాబట్టి ఒత్తిడి ఉండటం సహజం. కానీ ఒక జట్టుగా మేం రాబోయే రోజుల్లో మరింత మెరుగవుతాము. కెప్టెన్సీ గురించి చెప్పాలంటే.. రాబోయే మ్యాచ్ల్లో విజయం సాధిస్తే, టోర్నీలో మా ప్రయాణం మరింత సులువు అవుతుంది.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనికేత్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 43), హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) దూకుడుగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో జాకోబ్ డఫీ(3/22), రొమారియో షెఫెర్డ్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 61), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రజత్ పటీదార్(12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 31) దూకుడుగా ఆడారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో డేవిన్ పైన్ రెండు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే చెరో వికెట్ తీసారు.
