చెత్త బౌలింగ్, స్లాగ్ ఓవర్లలో పేలవ బ్యాటింగ్ తమ పతనాన్ని శాసించాయని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు. బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోతే ఏం చేయలేమని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది.
219 పరుగుల భారీ స్కోర్ను సన్రైజర్స్ కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఇషాన్ కిషన్.. ప్రత్యర్థి బ్యాటర్లకు తగ్గట్లు బౌలింగ్ చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు.

'మా స్కోరు పెద్దదే కానీ గెలవడానికి అది సరిపోలేదు. మేం ఆరంభించిన తీరును బట్టి 250 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేయాల్సింది. కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. మేం అనుకున్నన్ని పరుగులు చేయలేకపోయాం. అదే సమయంలో.. పంజాబ్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. పవర్ప్లే వారికి అనుకూలించింది.
మేం బౌలింగ్లో విఫలమయ్యాం. సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయాం. టీ20 క్రికెట్లో సరైన చోట బంతులు వేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఈరోజు మేం వెనకపడ్డాం. వాస్తవానికి 219 స్కోర్ మంచిదే. మా ఆరంభం చూసి ఈజీగా 240 పరుగులు చేస్తామని భావించాం. అయితే జట్టులో ఆరు ఏడుగురు బౌలర్లు ఉన్నప్పుడు 219 పరుగులను కాపాడుకోవచ్చు. కానీ ప్రత్యర్థి బ్యాటర్ల ఆటకు తగ్గట్లు బౌలింగ్ చేయాలి.

ఈ విషయంలో మేం వెనుకబడ్డాం. అందుకే చివర్లో వారు ఈజీగా పరుగులు రాబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ మధ్యలో ఎలాంటి ప్లాన్ చేయలేం. మ్యాచ్ ముందే ప్రణాళికలు రచించాలి. ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు..? ఒకవైపు బౌండరీ పొడవుగా ఉంటే, ఆ వైపును వాడుకోవాలనేది చూసుకోవాలి. కానీ సరైన లెంగ్త్లో బంతులు వేయలేనప్పుడు ఏం చేయలేం. ప్రతీ ఓవర్లో 10-20 పరుగులు అదనంగా ఇచ్చాం. పంజాబ్ బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు.
వీలైనంత త్వరగా ఈ పరాజయాన్ని మరిచి తదుపరి మ్యాచ్కు సిద్దమవుతాం. ఇది చాలా సింపుల్ క్రికెట్. బ్యాటింగ్కు వెళ్లడం, పరుగులు చేయడం. బౌలర్ల వద్ద ఒక టార్గెట్ ఉంటుంది. దానిని కాపాడటానికి ప్రయత్నించాలి. కానీ సరైన ప్లానింగ్ లేకుండా పరుగులను కట్టడి చేయలేం. ప్రణాళికలు, వాటిని అమలు చేయడంపైనే విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 74) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 38) దూకుడుగా ఆడాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, శశాంక్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్లెట్కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 57), ప్రభ్సిమ్రాన్ సింగ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 51), శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్(3/33) ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్దూబే ఒక వికెట్ తీసాడు.
