ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడనున్నాడా? చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా సంజూ శాంసన్ షేర్ చేసిన పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
ఐపీఎల్ 2025 సీజన్ ముగియడంతో సతీమణి చారులత రమేష్తో కలిసి సంజూ విదేశాల్లో పర్యటిస్తున్నాడు. అయితే తన భార్య చారులతతో కలిసి రోడ్డు దాటుతున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సంజూశాంసన్.. ఈ పోస్ట్కు 'వెళ్లాల్సిన సమయం వచ్చింది'అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలో సంజూ శాంసన్ పసుపు(ఎల్లో) లైన్ ధాటుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నాని సంజూ శాంసన్ హింట్ ఇచ్చాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు మేనేజ్మెంట్తో సంజూ శాంసన్కు విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ద్రవిడ్ ఖండించనప్పటికీ.. టీమ్ కీలక సమావేశాలకు సంజూ శాంసన్ దూరంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే సంజూ తాజా పోస్ట్పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్లోకి సంజూ శాంసన్ వచ్చేందుకు సమయం ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ ఆడటంపై సందేహం నెలకొంది. రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయని ధోనీ త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి బ్యాకప్గా ఉర్విల్ పటేల్ అనే యువ వికెట్ కీపర్ను తీసుకుంది. కానీ సంజూ శాంసన్ను వస్తానంటే ధోనీకి సరైన రిప్లేస్మెంట్ అతడేనని సీఎస్కే మేనేజ్మెంట్ భావిస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సంజూ సీఎస్కేలోకి రావాలని కోరుకుంటున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్లో గాయం కారణంగా సంజూ శాంసన్ 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 35.62 సగటు, 140.39 స్ట్రైక్రేట్తో 285 పరుగులు చేసాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున 4000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా సంజూ రికార్డ్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 41 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. గాయం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ మాత్రమే చేసిన సంజూ శాంసన్.. కొన్ని మ్యాచ్ల్లోనే జట్టును నడిపించాడు. ఎక్కువ మ్యాచ్ల్లో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్కు సారథ్యం వహించాడు.