బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026 సీజన్ ఆడకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారత ప్రజలు, రాజకీయ నాయకులు ఈ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు.
ప్రజల డిమాండ్కు తలొగ్గిన బీసీసీఐ.. తక్షణమే ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి తొలగించాలని కోల్కతా నైట్రైడర్స్కు సూచించింది. దాంతో ఆ జట్టు అతన్ని రిలీజ్ చేసింది. లీగ్ ప్రారంభానికి ముందే ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి తప్పించడంతో అతనికి ఫ్రాంచైజీ ఏమైనా డబ్బులు చెల్లించాలా? అనే చర్చ జోరుగా సాగుతుంది.

ముస్తాఫిజుర్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకోలేదు, నిబంధనలను ఉల్లంఘించలేదు కాబట్టి అతనికి కేకేఆర్ ఏమైనా డబ్బులు చెల్లిస్తుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ముస్తాఫిజుర్ను జట్టు నుంచి తప్పించడంతో కేకేఆర్ అతనికి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో పోటీపడి మరి దక్కించుకుంది. దాంతో వేలంలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిలిచాడు. కానీ బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా అతను ఐపీఎల్కు దూరం కావాల్సి వచ్చింది.
సాధారణంగా ఐపీఎల్ ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు ఇన్సురెన్స్ కడుతాయి. లీగ్ మధ్యలో గాయపడి దూరమైతే బీమా నుంచి 50 శాతం వరకు చెల్లిస్తారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు బోర్డు స్వయంగా చెల్లిస్తుంది. కానీ ముస్తాఫిజుర్ రెహ్మాన్.. టోర్నీకి ముందే తప్పుకున్నాడు కాబట్టి అతనికి ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదు. ఇది బీమా పరిధిలోకి కూడా రాదు. ముస్తాఫిజుర్కు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ కోర్టుల్లోనే అతను తేల్చుకోవాల్సి ఉంటుంది.
ముస్తాఫిజుర్ రెహ్మాన్పై వేటు వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించింది. మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరగాల్సిన తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరింది.