IPL 2026: ఉత్కంఠ రేపిన టాప్ 3 మ్యాచ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. మరెన్నో మరుపురాని మ్యాచ్లను అందించింది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో ఆఖరి బంతి వరకు సాగిన పోరాటాలు.. రికార్డ్ ఛేజ్లు.. ఆటగాళ్ల అసాధారణ ప్రదర్శనలతో లీగ్ దశ మొత్తం ఉత్సాహంగా సాగింది. 70 మ్యాచ్ల లీగ్ దశలో ఓ మూడు మ్యాచ్లు మాత్రం నరాలు తేగెంత ఉత్కంఠతో సాగాయి. వాటిని ఒకసారి నెమరువేసుకుందాం.
1. ఢిల్లీ క్యాపిటల్స్ VS పంజాబ్ కింగ్స్ (మ్యాచ్ 55)
ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఈ సీజన్లోనే ది బెస్ట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(56), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్ష్యఛేదనలో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్.. అక్షర్ పటేల్(30 బంతుల్లో 56) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51) విజయానికి బాటలు వేయగా.. అషుతోష్ శర్మ(24) మెరుపులు మెరిపించాడు.

2. గుజరాత్ టైటాన్స్ VS పంజాబ్ కింగ్స్ (మ్యాచ్ 46)
అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. విజయం కోసం ఇరు జట్లు ఆఖరి బంతి వరకు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్.. సూర్యాన్ష్ షెడ్గే (57), మార్కస్ స్టోయినిస్(40) దూకుడుతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ జేసన్ హోల్డర్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
లక్ష్యఛేదనలో గుజరాత్కు సాయి సుదర్శన్(57) అర్ధ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(40 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సుందర్ ఆఖరి ఓవర్లో సిక్సర్ బాది మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్నందించాడు. దాంతో గుజరాత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
3. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ (మ్యాచ్ 57)
రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. అంగ్క్రిష్ రఘువంశీ (71 పరుగులు), రింకు సింగ్ (నాటౌట్ 49 పరుగులు) దూకుడుతో కోల్కతా 4 వికెట్లకు 192 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది.
అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్లో మాత్రం చెలరేగాడు. తన బ్యాట్తో విమర్శకులకు బదులిచ్చాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులతో అజేయంగా నిలిచి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. కోహ్లీకి ఇది 9వ ఐపీఎల్ సెంచరీ. దాంతో ఆర్సీబీ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
గువాహటిలో వర్షం అంతరాయం కలిగించిన రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోరు కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో ముంబై చిత్తయ్యింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

