ఐపీఎల్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థార్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య గౌహతి వేదికగా జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం 7 గంటలకే టాస్ వేయాల్సి ఉండగా.. వర్షం ఆటంకం కలిగిస్తోంది. గౌహతిలో గత మూడు గంటల నుంచి వర్షం పడుతోంది.
సాయంత్రం 4.30 గంటల నుంచే చిన్నపాటి వర్షం మొదలైంది. దాంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేసారు. వర్షం ఆగితేనే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. లేకుంటే టాస్ పడకుండానే రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. కనీసం ఐదు ఓవర్ల ఆటను నిర్వహించేందుకు కటాఫ్ టైమ్ 10.56 గంటలుగా నిర్ణయించారు. అప్పటి వరకు అంపైర్లు వేచి చూడనున్నారు. కనీసం 5 ఓవర్ల ఆట సాధ్యమైతేనే మ్యాచ్ ఫలితాన్ని తేల్చనున్నారు. లేదంటే రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.

సోమవారం కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కోల్కతా వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షార్పణమైన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్లో శుభారంభం అందుకున్న ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన గత మ్యాచ్లో ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో ఎలాగైన విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలనే కసితో ముంబై ఇండియన్స్ ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని భావిస్తోంది.
మరోవైపు టీమిండియా దిగ్గజ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీనేజ్ సెన్సేషన్, సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ మధ్య పోరు ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటి వరకు బుమ్రా బౌలింగ్ను వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతున్న వైభవ్.. బుమ్రా బౌలింగ్లో రాణిస్తాడా? లేక ఇతర బ్యాటర్ల తరహాలో చేతులెత్తేస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.