IPL 2026: ఛోకర్స్ నుంచి ఛాంపియన్ టీమ్గా.. ఆర్సీబీ ఎలా మారిందంటే..?
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎన్నో ఏళ్లుగా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. స్టార్ ఆటగాళ్లు, అద్భుతమైన అభిమానుల మద్దతు, మెరుపు బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ గతంలో ఆ జట్టు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. కీలక సమయాల్లో చేతులెత్తేసి ఛోకర్స్గా ముద్ర వేసుకుంది. కానీ ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ఆర్సీబీలో గణనీయమైన మార్పు వచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఆర్సీబీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఐపీఎల్లోనే అత్యంత సమతుల్యమైన, వ్యూహాత్మకమైన జట్టుగా నిలిచింది.
కోహ్లీ ఒక్కడిపైనే..
గతంలో విరాట్ కోహ్లీపై ఆర్సీబీ ఆధారపడి ఉండేది. కానీ గత సీజన్ నుంచి వ్యూహాత్మకంగా ఎంతో పరిణతి చెందిన జట్టుగా మారింది. ఒక విజయవంతమైన జట్టు ఎలా ఉండాలో అలా ఉంది. ఏ ఒక్కడి ప్రదర్శనపై ఆధారపడకుండా మ్యాచ్కు ఓ విన్నర్తో గత సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. తాజా సీజన్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోవడంతో పాటు పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. మరోసారి టైటిల్ సాధించే దిశగా సాగుతోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంతో ఆర్సీబీ జట్టు పూర్తిగా మారిపోయింది. చాలా ఏళ్లుగా ఆర్సీబీ కేవలం స్టార్ ఆటగాళ్లను, బ్యాటింగ్కు అనుకూలించే కాంబినేషన్లను మాత్రమే ఎంచుకునేది. అది ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో జట్టును బలహీనపరిచేది. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో గ్లామర్కు కాకుండా జట్టు పటిష్టతకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆర్సీబీ దశ మారిపోయింది.
నయా కాంబినేషన్తో..
సెలెబ్రిటీ ఆటగాళ్లను కాకుండా జట్టుకు పనికొచ్చే ఆటగాళ్లను కొనుగోలు చేసింది. బ్యాటింగ్ డెప్త్తో పాటు బౌలింగ్ బలాన్ని పెంచింది. క్రికెట్ డైరెక్టర్ మో బోబట్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్తో పాటు మెంటార్ దినేశ్ కార్తీక్ బలమైన కాంబినేషన్ను ఎంచుకున్నారు. ఈ కొత్త వ్యూహం ఆర్సీబీకి ఫలితాన్నిచ్చింది. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్ వంటి అనుభవజ్ఞులైన భారతీయ ఆటగాళ్లపై ఆర్సీబీ భారీగా ఖర్చు చేసింది. వీరెవరూ భారీ అంచనాలతో ఆర్సీబీలోకి రాలేదు. కానీ, వారందరూ కలిసి జట్టుకు గొప్ప సమతుల్యతను అందించారు. ఈ కాంబినేషన్ 2025లో ఫ్రాంచైజీకి మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ను సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

సమతూకమైన కాంబినేషన్తో..
కోహ్లీపై అతిగా ఆధారపడకుండా.. ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్లతో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ను ఎంచుకుంది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ దూకుడు కోహ్లీకి స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ధాటిగా ఆడే రజత్ పాటిదార్, టీమ్ డేవిడ్, రొమారియో షెపెర్డ్ వంటి ఆటగాళ్లను తీసుకోవడం ఆర్సీబీకి కలిసొచ్చింది.
మునుపటి సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కూడా మరింత లోతుగా మారింది. ఫినిషర్లు, ఆల్రౌండర్లు క్రమం తప్పకుండా విలువైన పరుగులు అందిస్తున్నారు. బౌలింగ్లో జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటుతున్నారు. కృనాల్ మిడిల్ ఓవర్లలో దెబ్బతీస్తుండగా.. రసిఖ్దార్ సలామ్ తన వేరియేషన్స్తో ఆకట్టుకుంటున్నాడు. సుయాశ్ శర్మ తన స్పిన్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్టార్ ఆటగాళ్లపై ఆధారపడకుండా సమతూకమైన కాంబినేషన్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ఛాంపియన్ టీమ్గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications