ఐపీఎల్.. యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశం. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతమైన భారత యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జాతీయ జట్టులో అవకాశాలు అందుకొని స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. అయితే ఇప్పుడు కొందరు భారత సీనియర్ ఆటగాళ్ల కెరీర్లకు ఐపీఎల్ 2026 సీజన్ అగ్ని పరీక్షగా నిలవబోతుంది. ఈ టోర్నీలో కనబర్చే ప్రదర్శనపైనే వారి భవితవ్యం ఆధారపడి ఉంది.
మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే వన్డే ప్రపంచకప్ 2027 జట్టులో బెర్త్ ఖరారు కానుంది. ఇప్పటికే అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఐపీఎల్పై ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 20 మంది ప్రాబబుల్స్ ప్రదర్శనను నిశితంగా పరిశీలించనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు విడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. గతేడాది టెస్టుల నుంచి కూడా తప్పుకొన్నారు. ఆ ఇద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాదే ఈ ఇద్దర్నీ సాగనంపేస్తారనే వార్తలు వచ్చాయి.

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వీరిని పక్కన పెట్టాలనే యోచనలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. కానీ విరాట్, రోహిత్ అసాధారణ ప్రదర్శనతో తాము ఇంకా ఆడగలమని నిరూపించుకున్నారు. కానీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరి స్థానాలకు గ్యారెంటీ ఉందని చెప్పలేని పరిస్థితి.
ఇంకో ఏడాది పాటు ఫిట్నెస్, ఫామ్ను చాటుకుంటూ ఉంటేనే ఈ ఇద్దరూ ప్రపంచకప్ ఆడగలరు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అందరూ ఈ ఇద్దరి ఆటను నిశితంగా పరిశీలించనున్నారు. కాబట్టి ఇక్కడ వారు సత్తా చాటడం ఎంతో ముఖ్యం. గతేడాది కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే ఫార్మాట్లోనూ సెంచరీల మోత మోగించి సూపర్ ఫామ్లో ఉన్నాడు. అదే జోరును ఐపీఎల్లో కొనసాగితే విరాట్కు తిరుగుండదు.
రోహిత్ శర్మ గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. రెండేళ క్రితం ముంబై కెప్టెన్సీ కోల్పోయిన అతను.. గత సీజన్లోనూ ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోయాడు. కానీ వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి బరువు తగ్గిన రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2026 సీజన్లో అతను ఎలా రాణిస్తాడనేది హాట్టాపిక్గా మారింది.
రవీంద్ర జడేజా, మహహ్మద్ షమీలకు కూడా ఈ సీజన్ కీలకం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి సొంత గూటికి వచ్చిన జడేజా ఎలా రాణిస్తాడనేది చూడాలి. జడేజా బ్యాటింగ్కు డోకా లేకున్నా అతని బౌలింగ్పై ఆందోళన నెలకొంది.తన స్పిన్లో మర్మాన్ని బ్యాటర్లు సులువుగా కనిపెట్టేసి చెలరేగిపోతున్న నేపథ్యంలో అతను తన బౌలింగ్కు పదును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్లో తన ప్రత్యేకతను చాటుకోకుంటే.. వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు మీద ఆశలు వదులుకోవాల్సిందే.
దాదాపు పదేళ్ల పాటు టీమిండియాలో ప్రధాన పేసర్లలో ఒకడిగా కొనసాగిన మహమ్మద్ షమీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమైన షమీ.. తిరిగి ఫిట్నెస్ సాధించినా.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలనే లక్ష్యంతో ఉన్న షమీ.. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. గతేడాది పేలవ ప్రదర్శన కనబర్చడంతో సన్రైజర్స్ అతన్ని వదిలేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అసాధారణ ప్రదర్శన కనబర్చితే తప్పా.. షమీకి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవు.