ఐపీఎల్ 2026 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ మూడు మ్యాచ్ల్లో ఐదు ఇన్నింగ్స్ల్లో పూర్తిగా బ్యాటర్లే ఆధిపత్యం చెలాయించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మినహా అంతా బౌలర్లపై ప్రతాపం చూపారు. కానీ ఈ మూడు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను బౌలర్లే గెలుచుకోవడం గమనార్హం. అది కూడా పేసర్లకే ఈ అవార్డు దక్కింది.
ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 201 పరుగులు చేస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సన్రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ను కుప్పకూల్చిన ఆర్సీబీ పేసర్ జాకోబ్ డఫీ(3/22)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 221 పరుగులు చేస్తే.. ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్(3/39) మూడు వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
నిన్న మాత్రం వర్షం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బౌలర్ల ఆధిపత్యం నడిచింది. వర్షం కారణంగా స్లోగా మారిన గౌహతి వికెట్పై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడటంతో ఆ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ధనాధన్ బ్యాటింగ్తో 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగినా.. చెన్నై సూపర్ కింగ్స్ నడ్డి విరిచిన నండ్రే బర్గర్(2/26)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బ్యాటర్ల హవా నడుస్తున్న ఐపీఎల్ 2026 సీజన్లో మ్యాచ్ విన్నర్లుగా మాత్రం బౌలర్లు నిలుస్తుండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా పిచ్లు తయారు చేయవద్దని కూడా కోరుకుంటున్నారు.
ఐపీఎల్ పూర్తిగా బ్యాటర్ల లీగ్గా మారిపోయింది. ఐపీఎల్ 2008 నుంచి ఐపీఎల్ 2022 వరకు 133 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి. కానీ 2023 నుంచి తాజా సీజన్లోని తొలి రెండు మ్యాచ్ల వరకు 134 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయంటేనే బ్యాటర్ల ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే వికెట్లు తయారు చేయడం వల్ల బౌలర్లు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. బంతి, బ్యాట్కు సమతూకంగా ఉండే పిచ్లను సిద్దం చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.