జట్టు కోసమే తాను రిటైర్డ్ ఔటయ్యానని చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే అన్నాడు. ఇన్నింగ్స్ చివర్లో తాను దూకుడుగా ఆడలేకపోయానని, దాంతోనే బిగ్ షాట్స్ ఆడగల శివమ్ దూబేకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగానని వెల్లడించాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో తొలి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 59 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. శివమ్ దూబేకు అవకాశం ఇవ్వడం కోసం ఆయుష్ మాత్రే తప్పుకున్నాడు.
ఈ నిర్ణయం జట్టు విజయానికి దోహదపడింది. సీఎస్కే 18 ఓవర్లలో 175/2 పరుగులతో ఉన్నప్పుడు రన్ రేటు భారీగా తగ్గింది. 36 బంతుల్లో 59 పరుగులు చేసిన మాత్రే.. లుంగీ ఎన్గిడి, టీ నటరాజన్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. దాంతో చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే శివమ్ దూబేను బ్యాటింగ్ కు పంపాలని జట్టు నిర్ణయించింది. అందుకోసం ఆయుష్ మాత్రేను రిటైర్డ్ ఔట్గా వెనక్కి రప్పించింది. సీఎస్కే చేసిన ఈ వ్యూహం ఫలితాన్నించింది. శివమ్ దూబే దూకుడైన బ్యాటింగ్తో సీఎస్కే 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం తన రిటైర్డ్ ఔట్ వెనుక ఉన్న గల కారణాన్ని వెల్లడించాడు. 'ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణం ఏం లేదు. నేను మెరుగ్గానే ఆడుతున్నప్పటికీ.. జట్టుకు భారీ షాట్లు అవసరమయ్యాయి. ఈ పనిని శివమ్ దూబే సమర్థవంతంగా చేయగలడు. నేను వేగంగా పరుగులు చేయలేకపోయాను. దాంతో టీమ్ అలా ప్లాన్ చేసింది. ఇది ఆటలో భాగమే.
సీఎస్కే జట్టు నాకు ఒక కుటుంబంలా అనిపిస్తుంది. వారు నన్ను ఒక పసిపిల్లాడిలా చూసుకుంటున్నారు. ఈ జట్టుతో కలిసి ఆడటం నాకు చాలా ఇష్టం. సపోర్ట్ స్టాఫ్ కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు. వారు కూడా ఎంతో కష్టపడతారు’అని ఆయుష్ మాత్రే పేర్కొన్నాడు.

సంజూ శాంసన్తో కలిసి ఆయుష్ మాత్రే రెండో వికెట్కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆయుష్ మాత్రేపై సంజూ శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఆయుష్ మాత్రేతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం బాగుంది. అతను అండర్ 19 నుంచి వచ్చిన బ్యాటర్గా అనిపించడం లేదు. చాలా పరిణతితో ఆడాడు. చాలా లెక్కకట్టి మరీ సిక్స్లు కొట్టినట్లు ఉంది. అద్భుతమైన నైపుణ్యం ఉన్న క్రికెటర్. ’అని సంజూ కొనియాడాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లతో 115 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ఆయుష్ మాత్రే(36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. ఆయుష్ మాత్రే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో189 పరుగులకు ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్(38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 60) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. పాతుమ్ నిస్సంక(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 41) దూకుడుగా ఆడాడు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్(4/18) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
