చెత్త ఫీల్డింగే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. బౌలింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై క్యాచ్లు చేజార్చడం ఏ మాత్రం సమంజసం కాదని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెత్త ఫీల్డింగ్తో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కాపాడుకోలేకపోయింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. క్యాచ్లు వదిలేయడంతో పాటు పవర్ ప్లే బౌలింగ్ తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. 'బౌలింగ్కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్పై వచ్చిన అవకాశాలను వదిలేస్తే ఎలా గెలుస్తాం. సునాయస క్యాచ్లను వదిలేయడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్. చిన్న మైదానం కాబట్టి సిక్సర్లు వెళ్లడం సహజం. కానీ వచ్చిన క్యాచ్లను వదిలేస్తే గెలవడం కష్టం.

ఇలాంటి వికెట్పై బౌలర్లకు అండగా ఉండకపోతే పరిస్థితులు కఠినంగా మారుతాయి. మా బౌలింగ్ విభాగాన్ని కూడా మేం సమీక్షించుకోవాలి. పవర్ ప్లేలో మా ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసిన తీరు, ఫీల్డింగ్, చేజార్చిన క్యాచ్లు మా ఓటమికి ప్రధాన కారణాలు.ఎందుకంటే ఈ వికెట్పై 264 అనేది చాలా మంచి స్కోరు.
ఈ మ్యాచ్లో ఓడినా 264 పరుగులు చేయడం మాకు కలిసొచ్చే అంశం. ఐపీఎల్లోనే ఇది రికార్డ్ స్కోర్. కొంచెం అదృష్టం కలిసొచ్చి క్యాచ్లు పట్టి ఉంటే.. వరుసగా మ్యాచ్లు గెలవగలం. మేం ఓడిపోయిన మ్యాచ్లన్నీ తృటిలో కోల్పోయినవే. కీలక సమయాల్లో పట్టు సాధిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. కానీ ఆ క్షణాలను మేం అందిపుచ్చుకోవాలి. ప్రతిసారి మైదానంలోకి వచ్చి అవే తప్పులను పునరావృతం చేయకూడదు. అందుకే మేం మా ఆటతీరుపై సమీక్ష చేసుకోవాలనుకుంటున్నాం.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్లతో 152 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. నితీష్ రాణా(44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 265 పరుగులు చేసి గెలుపొందింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 76), ప్రియాన్ష్ ఆరర్య(17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 43), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 71 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/46) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది.
