ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్)తో ఎంతో మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. క్రికెట్ కిట్కు గతిలేని ఆటగాళ్లను కూడా స్టార్ ఆటగాళ్లుగా నిలబెట్టింది ఐపీఎల్. గత 17 ఏళ్లుగా ప్రతీ ఏడాది ఎంతోమంది అనామక ఆటగాళ్లు కోటీశ్వరులుగా మారారు. స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. తాజాగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ కొంతమంది ఆటగాళ్ల పంట పండింది.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్లు రాత్రికి రాత్రే సూపర్ స్టార్లు అయ్యారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన అనామక ఆటగాళ్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఇద్దరి ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడటంతో రూ.14.20 కోట్ల భారీ ధర పలికారు. ఈ డబ్బుతో వారి జీవితాలే పూర్తిగా మారిపోనున్నాయి.

అయితే ఈ రూ.14.20 కోట్లలో దురదృష్టవశాత్తు వారికి రూ.8.66 కోట్లే దక్కనున్నాయి. ఎందుకంటే రూ.5.538 కోట్లు టాక్స్ రూపంలో కోత పడనుంది. ఈ రూ.14.20 కోట్లలో టీడీఎస్ కింద రూ.1.42 కోట్ల కట్ అవనున్నాయి. ఈ డబ్బులు పోగా మిగిలిన రూ.12.78 కోట్లను ఈ అనామక ఆటగాళ్ల వృత్తిపరమైన ఆదాయంగా పరిగణిస్తారు. దాంతో వారు వారు అత్యధిక ఆదాయ స్లాబ్ (ఏడాదికి 24 లక్షల రూపాయల కంటే ఎక్కువ) పరిధిలోకి వస్తారు.
ఈ మొత్తంపై వారికి 30 శాతం ఆదాయపు పన్ను పడుతుంది. అంతేకాకుండా భారీ ఆదాయం ఉన్నందున ప్రాథమిక పన్నుపై 25 శాతం సర్ఛార్జ్ కూడా విధిస్తారు. అయితే ఆరోగ్య, విద్యా సెస్గా 4 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ లెక్కన రూ.5.538 కోట్ల ట్యాక్స్ రూపంలోనే కోతకు గురవుతాయి. ఇవన్నీ పోగా ఈ ఇద్దరి ఆటగాళ్లకు రూ.8.66 కోట్లే దక్కుతాయి.
ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ ఆటతీరు రవీంద్ర జడేజాను పోలి ఉంటుంది. దాంతో అతన్ని ప్రశాంత్ వీర్ను జడేజా 2.oగా పిలుస్తారు. జడేజాలా స్పిన్ బౌలింగ్ చేయడంతో పాటు చివర్లో వచ్చి భారీ షాట్స్ ఆడటం ప్రశాంత్ వీర్ ప్రత్యేకత. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజా ట్రెడింగ్ ద్వారా రాజస్తాన్ రాయల్స్కు వెళ్లి పోవడంతో అతని స్థానాన్ని ప్రశాంత్ వీర్తో భర్తీ చేయాలని సీఎస్కే భావించింది. వేలానికి ముందే అతన్ని ట్రయల్స్కు ఆహ్వానించి పరీక్షించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉందని గ్రహించిన సీఎస్కే మేనేజ్మెంట్ వేలంలో అతని కోసం దూకుడుగా బిడ్ వేసింది. దాంతో ప్రశాంత్ వీర్కు జాక్ పాట్ ధర దక్కింది.
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మను సీఎస్కే మహేంద్ర సింగ్ ధోనీకి బ్యాకప్గా తీసుకుంది. దేశవాళీ క్రికెట్లో కార్తీక్ శర్మకు మెరుగైన రికార్డ్ ఉంది. తన అరంగేట్ర రంజీ మ్యాచ్లోనే కార్తీక్ శర్మ(113) సెంచరీతో చెలరేగాడు. తాజాగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 160.24 స్ట్రైక్ రేట్తో 133 పరుగులు చేశాడు.
ముఖ్యంగా భారీ సిక్సర్లు బాదే అతని సామర్థ్యం ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు 12 టీ20 మ్యాచ్ల్లు ఆడిన కార్తీక్ శర్మ 164 స్ట్రైక్ రేట్తో 334 పరుగులు చేశాడు. ఇందులో 28 సిక్సర్లు ఉండటం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరపున 9 మ్యాచ్ల్లో 445 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.