ఐపీఎల్ 2026 మినీ వేలంలో అనామక ఆటగాళ్లు అయిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన అనామక ఆటగాళ్లుగా నిలిచారు. స్పిన్ ఆల్రౌండర్ అయిన ప్రశాంత్ వీర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మలను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మరో అనామక ఆల్రౌండర్ అకీబ్ దార్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది.
కనీస ధర రూ.30 లక్షలతో ఈ ఇద్దరూ వేలంలోకి రాగా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్తో పాటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి. దాంతో అతని ధర అమాంతం పెరిగింది. చివరకు సీఎస్కే రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని ఆటతీరు రవీంద్ర జడేజాను పోలి ఉండటంతో ప్రశాంత్ వీర్ను జడేజా 2.oగా పిలుస్తారు.

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజా ట్రెడింగ్ ద్వారా రాజస్తాన్ రాయల్స్కు వెళ్లి పోవడంతో అతని స్థానాన్ని ప్రశాంత్ వీర్తో భర్తీ చేయాలని సీఎస్కే భావించింది. వేలానికి ముందే అతన్ని ట్రయల్స్కు ఆహ్వానించి పరీక్షించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉందని గ్రహించిన సీఎస్కే మేనేజ్మెంట్ వేలంలో అతని కోసం దూకుడుగా బిడ్ వేసింది. దాంతో ప్రశాంత్ వీర్కు జాక్ పాట్ ధర దక్కింది.
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ కోసం కేకేఆర్, సీఎస్కే, సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీపడ్డాయి. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంతో ఈ కుర్రాడిపై సీఎస్కే కోట్లు కుమ్మరించింది. దేశవాళీ క్రికెట్లో కార్తీక్ శర్మకు మెరుగైన రికార్డ్ ఉంది. తన అరంగేట్ర రంజీ మ్యాచ్లోనే కార్తీక్ శర్మ(113) సెంచరీతో చెలరేగాడు. తాజాగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 160.24 స్ట్రైక్ రేట్తో 133 పరుగులు చేశాడు.
ముఖ్యంగా భారీ సిక్సర్లు బాదే అతని సామర్థ్యం ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు 12 టీ20 మ్యాచ్ల్లు ఆడిన కార్తీక్ శర్మ 164 స్ట్రైక్ రేట్తో 334 పరుగులు చేశాడు. ఇందులో 28 సిక్సర్లు ఉండటం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరపున 9 మ్యాచ్ల్లో 445 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.
అనామక పేస్ ఆల్రౌండర్ ఆకీబ్ దార్ కూడా రికార్డ్ ధర సొంతం చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ కోసం ఢిల్లీ, సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ. 8.40 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఆకీబ్ దార్కు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. దులీప్ ట్రోఫీ చరిత్రలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఆకీబ్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రదర్శనే అతనికి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికేలా చేసింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో కేవలం 7 మ్యాచ్ల్లోనే 15 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో ఆకీబ్ దార్ ఎకానమీ రేటు 8 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 36 మ్యాచ్లు ఆడి 125 వికెట్లు తీశాడు. ఇందులో 12 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. బ్యాటింగ్లో కూడా ఒక అర్ధ సెంచరీ సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 29 మ్యాచ్ల్లో 42 వికెట్లు తీశాడు.