ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 77 స్థానాల కోసం 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు 10 జట్లకు అందించారు. పది ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయనున్నాయి. డిసెంబర్ 5 నాటికి తమ షార్ట్ లిస్ట్ జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అందజేయాల్సి ఉంటుంది. 10 ఫ్రాంచైజీల షార్ట్ లిస్ట్ జాబితాల నుంచి నిర్వాహకులు తుది జాబితాను సిద్దం చేసి వేలం వేస్తారు.
ప్రతీ జట్టు గరిష్టంగా 25 మంది కనిష్టంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నాయి. ఈ 77 మందిలో విదేశీ ఆటగాళ్లకు 31 స్లాట్స్ ఉన్నాయి. ఈ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గాయంతో అతను ఐపీఎల్ 2025 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు. దాంతో ఈసారి అతనికి భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. రిటెన్షన్ ప్రక్రియ తర్వాత కేకేఆర్ జట్టుకు అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉంది. ఆ జట్టు దగ్గర రూ.64.3 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.4 కోట్ల డబ్బులున్నాయి.

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్, సౌతాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2026 టోర్నీకి దూరంగా ఉన్నారు. రస్సెల్ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్గా అవతారమెత్తగా.. డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఈసారి వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. పీఎస్ఎల్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పగా.. ఈ సీజన్కు దూరంగా ఉండాలని మ్యాక్స్వెల్ నిర్ణయించుకున్నాడు.